యాప్నగరం

ఖాకీల కర్కశత్వం.. గ్రామంలోకి వెళ్లి ఆడవాళ్లని చూడకుండా.. వీడియో

మధ్యప్రదేశ్‌ పోలీసుల తీరుపై మరోసారి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించి ప్రజాగ్రహానికి గురైన మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది.

Samayam Telugu 12 Apr 2021, 3:10 pm

ప్రధానాంశాలు:

  • గ్రామంలోకి వెళ్లి జనాలను చితక్కొట్టిన పోలీసులు.
  • ఆడవాళ్లు ప్రాధేయపడ్డా కనికరించని ఖాకీలు.
  • వీడియో వైరల్ కావడంతో పోలీసులపై చర్యలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
మాస్క్ ధరించని ఆటో డ్రైవర్‌పై పోలీసులు దాడికి తెగబడి అతి కిరాతకంగా వ్యవహరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరోసారి ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఖండ్వాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ బాధితుడి బంధువులు, వైద్య ఆరోగ్య సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. వైద్య సిబ్బందిపై దాడిచేశారని ఆరోపిస్తూ కోవిడ్ రోగి, అతడి కుటుంబసభ్యుల చితకబాదారు. కొట్టొద్దని ఆడవాళ్లు వేడుకున్నా వారి పట్ల కూడా క్రూరంగా వ్యవహరించారు.
ఛియాగావ్ మఖాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సోడ్ బంజారీ గ్రామానికి చెందిన యువకుడికి కోవిడ్ సోకడంతో ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ వైద్య సిబ్బందిపై కోవిడ్ రోగి, అతడి కుటుంబసభ్యులు దాడిచేశారని ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై కూడా దాడిచేశారని, ఈ సమయంలో ఎస్ఐ, ఏఎస్ఐకి గాయాలైనట్టు ఛియాగావ్ మఖాన్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారి కనైలీ తెలిపారు.

‘‘యువకుడికి శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం వచ్చిన నివేదికలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆ గ్రామానికి ఆరోగ్య సిబ్బంది వెళ్లినప్పుడు దాడిచేశారు.. హోం క్వారంటైన్‌లోనే ఉంటానని వాగ్వాదానికి దిగాడు.. అది ఘర్షణకు దారితీసింది.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని కోవిడ్ రోగి, అతడి కుటుంబసభ్యులపై లాఠీలతో విచక్షణరహితంగా కొట్టారు. వదిలేయాలని ప్రాధేయపడినా కనికరించలేదు’’ అని ఎస్పీ పేర్కొన్నారు.

దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వివేక్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.