యాప్నగరం

కరోనాతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. అంబులెన్స్‌కు నిప్పంటించిన బంధువులు

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు నిప్పంటించి, ఆస్పత్రిపై రాళ్లు రువ్విన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Samayam Telugu 23 Jul 2020, 9:29 am
కరోనా వైరస్‌తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడంతో అతడి కుటుంబసభ్యులు అంబులెన్స్ తగులబెట్టి, వైద్యులపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావీలో బుధవారం చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు నిప్పంటించడమే కాదు, ఐసీయూలోని వైద్యులపై కూడా దాడికి యత్నించి, హాస్పిటల్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెలగావీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతడిని వైద్యం కోసం స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, ఆ వ్యక్తి పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు. సరైన వైద్యం అందకపోవడంతోనే చనిపోయాడని అతడి కుటుంబసభ్యలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు.
Samayam Telugu అంబులెన్స్‌ తగులబెట్టిన కోవిడ్ రోగి బంధువులు
Ambulance Torch in Karnataka


అంబులెన్స్‌కు నిప్పంటించిన మృతుడి కుటుంబసభ్యులు.. ఐసీయూలోని వైద్యులపై కూడా దాడిచేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో అంబులెన్స్ పూర్తిగా దగ్దం కాగా.. బిమ్స్ హాస్పిటల్ అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపుచేశారు. మృతుడి బంధువులను చెదరగొట్టి, ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఐసీయూలో చికిత్స పొందుతున్న తమ కుటుంబసభ్యుడు చనిపోయాడని మృతుడు బంధువులు ఆరోపించారు. హాస్పిటల్‌లోని కోవిడ్ వార్డు ముందున్న అంబులెన్స్‌కు నిప్పుపెట్టారు. అక్కడే ఉన్న పోలీసులు, ఇతర వాహనాలపైకి రాళ్లు రువ్వారు. ఇదే సమయంలో ఐసీయూలోని డాక్టరుపై కూడా చేయిచేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

బుధవారం కొత్తగా 4,764 మందికి వైరస్ సోకగా.. మరో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కర్ణాటకలో మొత్తం కేసులు సంఖ్య 75,833కి చేరగా.. మరణాల సంఖ్య 1,519కి చేరింది. బెంగళూరు నగరంలోనే 2,050 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 27 వేల మంది కోలుకోగా.. 46 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.