యాప్నగరం

దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు.. ఐబీ హెచ్చరికలతో హై అలర్ట్

నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు సమీపంలో వీరు దేశంలోకి ప్రవేశించారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ విధించారు.

Samayam Telugu 20 Aug 2019, 1:38 pm
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత.. దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నాం అని ఊపిరి పీల్చుకునే లోగానే.. ఇంటెలిజెన్స్ బ్యూరో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్ తీరం నుంచి నలుగురు అప్ఘాన్ ఉగ్రవాదులు, ఒక ఐఎస్ఐ ఏజెంట్ దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. వీరు దాడులకు తెగబడొచ్చని హెచ్చరించింది.
Samayam Telugu high alert


దీంతో గుజరాత్‌తోపాటు దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలను ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల ఎస్పీలకు అడిషనల్ డీజీపీ కైలాశ్ మక్వానా నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని నిఘా వర్గాలు కోరాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.