యాప్నగరం

కరోనా కొత్త షాక్.. కోలుకున్న వారికి హార్ట్ ఎటాక్

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. తొలి దశలో కరోనా బారిన పడి కోలుకున్న వారిలో అత్యధికులు గుండె సంబంధిత రుగ్మతలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మరణానికి దారితీసే గుండె, రక్తనాళాల రుగ్మతలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Samayam Telugu 19 May 2020, 10:18 pm
కరోనా వైరస్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.. గుండెపైనా ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో కొందరు గుండె సంబంధిత సమస్యలతో మళ్లీ ఆస్పత్రుల పాలవుతుండటం ఆందోళ కలిగిస్తోంది. ఇప్పటివరకు కొవిడ్-19 కారణంగా సంభవించిన మరణాల్లో 40 శాతం మంది గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నవారే కావడం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. గుండె సంబంధిత, రక్తనాళాల వ్యాధులకు కొవిడ్‌-19 కారణం అవుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu covid 19 may damage your heart high risk for patients with high bp hypertension
కరోనా కొత్త షాక్.. కోలుకున్న వారికి హార్ట్ ఎటాక్


బీపీ, షుగర్ ఉన్నవారిపై అధిక ప్రభావం

బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నవారిపై కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపుతోంది. ఇలాంటివారు కొవిడ్-19 బారినపడితే వారి ఆరోగ్యం క్షీణించి మరణాలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. బీపీ, షుగర్ ఉన్నవారు కొవిడ్-19 విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. సాధారణ ప్రజల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే హెచ్చరించాయి. భారత్‌లో బీపీ సమస్యతో బాధ పడుతున్న వారు సుమారు 20 కోట్ల మంది ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.

కరోనా రోగుల్లో ఇతర సమస్యలు

కరోనా వైరస్ దుష్ప్రభావాలపై పలు సంస్థలు అధ్యయనం జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్-19 నుంచి కోలుకున్న పలువురు రోగుల్లో ఇతర సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. గుండె వైఫల్యం (హార్ట్ ఎటాక్), గుండె పోటు, రక్తం గడ్డకట్టేందుకు కరోనా వైరస్ దోహదం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నివారణకు వినియోగిస్తున్న డ్రగ్స్.. గుండె సంబంధిత రోగాల మందులతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో సంచలన వివరాలు పేర్కొన్నారు.

ఇక ఆ సమస్యలపైనా దృష్టి పెట్టాలి

ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే శ్వాస సంబంధిత సమస్యలపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారించి చికిత్స అందిస్తున్నారని.. మరణానికి దారితీసే గుండె, రక్తనాళాల రుగ్మతలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు. కరోనాకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ లాంటి డ్రగ్స్ అంతకుముందే వాడుతున్న గుండె సంబంధ ఔషధాలతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే.

కోలుకున్న వారిలో 24% మందికి గుండె సమస్యలు

కరోనా వైరస్ సోకిన తొలి దశలో వైరస్ బారినపడి కోలుకున్న వారిలో 24 శాతం మంది తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్నట్టు గుర్తించామని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్త విలియం బ్రాడీ తెలిపారు. కొవిడ్‌-19 వల్లే ఇలా జరుగుతోందా లేదా గతంలో గుర్తించని గుండె జబ్బులు ముదురుతున్నాయా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన అన్నారు. కొవిడ్‌-19 లక్షణాలున్న వారిని ఎక్కువగా పరిశీలించేకొద్దీ వైరస్ సైడ్ ఎఫెక్ట్స్‌ను మరింత అర్థం చేసుకోగలిగామని ఆయన చెప్పారు.

అంతకుముందు గుండె సమస్య లేకున్నా..

గుండె వైఫల్యం చెందిన రోగుల్లో సగం మందికి అంతకుముందు అధిక రక్తపోటు (బీపీ) సమస్య లేదని వైద్య నిపుణులు చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌-19, ఇతర రోగాల వల్ల శరీరంలో ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్‌ (మంట) జరుగుతోందని, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుండవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌లు కొవ్వు గడ్డకట్టే వేగం పెంచుతాయని వారు వివరించారు.

(Also Read: బస్టాండ్‌లో కరోనా రోగి మృతదేహం
Must Read: చైనాకు మరోసారి కరోనా ముప్పు.. ఆందోళనకర లక్షణాలు )

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.