యాప్నగరం

దిశ మార్చుకున్న ఓఖి.. మహారాష్ట్ర వైపు పయనం!

తమిళనాడు, కేరళలో తీవ్ర నష్టాన్ని కలిగించిన ఓఖి తుపాను దిశ మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ పెను తుపాను ఆదివారం నుంచి బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

TNN 3 Dec 2017, 1:12 pm
తమిళనాడు, కేరళలో తీవ్ర నష్టాన్ని కలిగించిన ఓఖి తుపాను దిశ మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ పెను తుపాను ఆదివారం నుంచి బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. లక్షద్వీప్‌ ప్రాంతంపై కేంద్రీకృతమైన ఓఖి వాయువ్య దిశగా గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ వైపు పయనిస్తోంది. మరో 48 గంటల్లో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఓఖి ప్రభావంతో తమిళనాడు, కేరళలో ఇప్పటి వరకూ 12 మంది, లక్షద్వీప్‌లో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Samayam Telugu cyclone ockhi make landfall in gujarat maharashtra in next 48 hours
దిశ మార్చుకున్న ఓఖి.. మహారాష్ట్ర వైపు పయనం!


కేరళలోని తుపాను ప్రభావిత జిల్లాలైన తిరువనంతపురం, కొల్లామ్‌, ఎర్నాకులమ్‌, త్రిసూర్‌, మలపురంలో 34 శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వేలాది మందిని తరలించింది. ఇక లక్షద్వీప్‌లో‌నూ తుపాను బీభత్సం సృష్టించింది. ఇక్కడ వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
తమిళనాడు, కేరళలో గల్లైంతన 200 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు కేరళ వ్యాప్తంగా 531 మంది మత్స్యకారులను ఇప్పటి వరకూ రక్షించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలియజేశారు. భారత నేవీ, వైమానిక, కోస్ట్‌ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరారు.

ఓఖి తుపాను ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, తూత్తుకుడి జిల్లాలు అతాలాకుతలం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క కన్యాకుమారి జిల్లాలోనే వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ తుపాను దిశ మార్చుకోవడంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను మహారాష్ట్ర వద్ద తీరాన్ని దాటితే గోదావరికి భారీ వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సైతం చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.