యాప్నగరం

గూడ్సు రైలు ఇంజిన్‌పై చిరుత.. కాసేపటి తర్వాత అసలు విషయం తెలిసి షాక్

థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గును తీసుకెళ్లడానికి ఓ గూడ్సు రైలు మంగళవారం ఉదయం వచ్చింది. సమీప స్టేషన్‌లో ఆగిన తర్వాత.. నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కనిపించింది. దీంతో సిబ్బంది హడలిపోయారు. తొలుత అది ప్రాణాలతోనే ఉందని భావించారు. కానీ, చివరకు చిరుత కళేబరంగా గుర్తించారు. ఈ విషయం గురించి స్థానిక రైల్వే అధికారులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. అటవీ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 8 Mar 2023, 4:35 pm

ప్రధానాంశాలు:

  • పవర్ ప్లాంట్‌కు బొగ్గు తీసుకెళ్లడానికి వచ్చిన గూడ్సు రైలు
  • స్టేషన్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌పై చిరుతను చూసిన అధికారులు
  • అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన రైల్వే సిబ్బంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Leopard Dead Body
రైలు ఇంజిన్‌పై చిరుతపులి కళేబరాన్ని గుర్తించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా వనీ బొగ్గు గని క్షేత్రంలోని గుగ్గూస్‌ రైల్వే సైడింగ్‌ మంగళవారం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం ఉండటంతో స్థానిక రైల్వే అధికారి రాజేష్‌సింగ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం అటవీ అధికారులకు వారు విషయం తెలియజేయడంతో కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం చంద్రపూర్‌కు తరలించారు. కళేబరం లభించిన రైలు ఇంజిన్‌ చంద్రపూర్‌లోని సీటీపీఎస్‌ (చంద్రపూర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌)కు బొగ్గును తరలించేందుకు మంగళవారం ఉదయం 7 గంటలకు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఆ సమయంలో గూడ్సు ఇంజిన్ పైభాగంలో కళేబరం కనిపించినట్టు రైల్వే అధికారులు చెప్పారు. తొలుత ఇంజిన్‌పై చిరుత నిద్రపోతుందేమోనని భావించారు. కానీ, ఎంతకీ దానిలో కదలికలు లేకపోవడంతో చనిపోయినట్టు గుర్తించారు. సీటీపీఎస్‌ తాడోబా పరిసరాల్లో ఉన్నందున రైలు వచ్చే క్రమంలో ఇంజిన్‌ పైనుంచి దూకబోయిన చిరుత హైటెన్షన్‌ విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణం కోల్పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.


చంద్రపూర్ జిల్లాలోని తడోబా అటవీ ప్రాంతం సమీపంలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుగబంట్లు, ఇతర జంతువులకు నిలయం. పవర్ ప్లాంట్ ఉద్యోగులకు క్రూర మృగాలు నిరంతరం తారసపడతుంటాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట చంద్రపూర్ అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. తాజాగా, రైలు ఇంజిన్‌పై మరో కళేబరం గుర్తించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఏదైనా మిస్టరీ ఉందా? అనే అనుమానం కలుగుతోంది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.