యాప్నగరం

యూపీలో హింస: 18కి చేరిన మృతులు.. 269 మంది పోలీసులకు గాాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్, కేరళ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజాందోళన కొనసాగింది. పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భగ్గుమన్నారు.

Samayam Telugu 22 Dec 2019, 12:28 pm
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఆ సంఖ్య 18కి చేరింది. వీరిలో ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. గురువారం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో నాలుగు రోజుల్లో 18 మంది మృతిచెందారు. శనివారం నాడు రామ్‌పూర్‌లో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.కాన్పూర్‌లో పోలీస్ ఔట్‌పోస్ట్‌కు సైతం నిప్పంటించారు. అల్లర్లలో 269 మంది పోలీసులు గాయపడ్డారని, వారిలో 57 మందికి బుల్లెట్లు తగిలినట్టు యూపీ ఐజీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
Samayam Telugu death toll reaches 18 in uttar preadesh due to caa protest 705 arrested
యూపీలో హింస: 18కి చేరిన మృతులు.. 269 మంది పోలీసులకు గాాయాలు


మొత్తం 5,400 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు, 705 మంది జైలుకు తరలించారు. ఆందోళనకారుల నుంచి 405 నాటు తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దీపక్ కబీర్ అలియాస్ దీపక్ మిశ్రా, ఎస్ఆర్ దర్మపురి లాంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మొత్తం 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయగా, వాట్సాప్‌లో వదంతులు వ్యాపింపజేస్తున్నవారిని 13,000 మందికిపైగా గుర్తించారు.

శనివారం నాడు 14 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేసి, పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. మొత్తం 21 జిల్లాల్లో సోమవారం వరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించారు. యూపీలో హింస పెచ్చుమీరడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. హింసను ప్రేరేపించేవారిని గుర్తించడానికి నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయానికి వచ్చింది. ఆందోళనలు సందర్భంగా ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంపై కూడా ఈ కమిటీ విచారణ చేయనుంది.

కాగా, నాలుగు రోజుల అనంతరం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టిన నిరసనలకు నాన్-టీచింగ్ స్టాఫ్ సైతం మద్దతుతెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆర్జేడీ ఇచ్చిన బంద్‌ పిలుపుతో రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పెద్దఎత్తున ఆస్తుల విధ్వంసం చోటు చేసుకొంది. ఢిల్లీలో భీమ్‌ ఆర్మీ సంస్థ నేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. బెయిల్‌ కోసం ఆజాద్‌ చేసుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.