యాప్నగరం

వైద్యులారా వందనం.. కరోనా పోరులో మరణిస్తే రూ. కోటి

Rs 1 Crore For Doctors: కరోనా రోగుల కోసం ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. సైనికులకు ప్రకటించినట్లుగా కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.

Samayam Telugu 1 Apr 2020, 6:04 pm
రోనా బారినపడ్డ రోగులకు దేశంలోని వైద్య సిబ్బంది మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సేవ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వారు చేస్తున్న సేవ అనితరసాధ్యం. అలాంటి వైద్య సిబ్బందిలో మరింత ఉత్సాహం నింపేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. వారు ప్రభుత్వ లేదా పైవేట్ ఏ రంగం వారైనా ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు. కోవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కేజ్రీవాల్ కొనియాడారు.
Samayam Telugu doctors


‘యుద్ధం వస్తే సైనికులు దేశాన్ని కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడుతారు. మనమందరం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ వైద్య సిబ్బంది అందిస్తున్న సేవ సైనికుల సేవకు ఏమాత్రం తీసిపోనిది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు’ అని కేజ్రీవాల్ అన్నారు. బుధవారం (ఏప్రిల్ 1) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read: వలస కూలీల కోసం కేసీఆర్ ఔదార్యం.. దేశానికే స్ఫూర్తిగా

కరోనా బాధితుల కోసం సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ పరిహారం చెల్లించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దేశ రక్షణలో భాగంగా ఎవరైనా సైనికుడు ప్రాణాలు కోల్పోతే.. అతడి కుటుంబానికి కోటి రూపాయలు అందిస్తామంటూ సీఎం కేజ్రీవాల్ గతంలో చేసిన ప్రకటన దేశవాసులను కదిలించింది. తాజాగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బంది కోసం ఆయన చేసిన ప్రకటన కూడా పలు రాష్ట్రాలకు స్ఫూర్తినివ్వనుంది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బుధవారం నాటికి 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడం కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Don't Miss: కరోనా సోకినా వదలని టిక్‌టాక్ పిచ్చి.. యువతికి వార్డులో బోర్ కొడుతోందట

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.