హాజరు వేయలేదనే కారణంతో ఉపాధ్యాయుణ్ని పొడిచిన చంపిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఆ ఉపాధ్యాయుడి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముకేశ్ కుమార్ కుటుంబానికి తాము ఇస్తోంది పరిహారం కాదని, ఆర్థిక సాయం మాత్రమేనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఆ కుటుంబం వేదనను తీర్చడం సాధ్యం కాదని, తక్షణ సాయంగా కోటి రూపాయలు అందజేస్తున్నామని ఆయన ప్రకటించారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ముఖేశ్ కుమార్ హిందీ టీచర్గా పనిచేసేవాడు. సోమవారం స్కూల్లో పరీక్ష నిర్వహిస్తుండగా తరగతి గదిలోకి వచ్చిన ఇద్దరు విద్యార్థులు తమకు హాజరు వేయలేదనే కారణంతో ఆయన్ను కత్తితో పొడిచారు. దీంతో ముకేశ్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలాడు. ముకేశ్ కుమార్ సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రికి వెళ్లిన మనీశ్ సిసోడియా.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుందన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలా పనిచేస్తాడో... అలాగే సమాజానికి గురువు తోడ్పాటు కూడా అంతే ఉంటుందన్నారు.
ఆ టీచర్ కుటుంబానికి రూ. కోటి తక్షణ సాయం
విద్యార్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన టీచర్ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించింది.
TNN 27 Sep 2016, 3:54 pm