యాప్నగరం

Nirbhaya Case: దోషులకు ఉరే సరి.. హైకోర్టు‌లో ట్విస్టుల మీద ట్విస్టులు

Delhi Gang Rape Case | నిర్భయ దోషుల ఆఖరి ప్రయత్నాలు ఆవిరయ్యాయి. మరణ శిక్ష అమలుపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

Samayam Telugu 20 Mar 2020, 9:10 am
ఆఖరి నిమిషంలో ఉరిని తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలకు హైకోర్టు గండికొట్టింది. శుక్రవారం ఉదయం నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా.. గురువారం సాయంత్రం ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించారు. మరణ శిక్షపై స్టే విధించడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ.. నిర్భయ దోషులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. మరణ శిక్ష అమలును వాయిదా వేయాలని కోరుతూ ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించిన జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం రాత్రి 12 గంటలు దాటాక కొట్టివేసింది.
Samayam Telugu nirbhay convicts hang


నిర్భయ దోషుల పిటిషన్‌ విచారణను రాత్రి 10 గంటల సమయంలో ప్రారంభించిన హైకోర్ట్.. వాదనలు వినిపించడం కాదు లీగల్ పాయింట్ మాత్రమే మాట్లాడాలని దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్‌కు సూచించింది. మీరు ముఖ్యమైన పాయింట్‌ను లేవనెత్తలేకపోతే.. చివరి నిమిషంలో మేం మీకేం సాయం చేయలేమని అశక్తతను వ్యకతం చేసింది. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దని దోషుల లాయర్‌కు న్యాయస్థానం సూచించింది. మీ క్లయింట్లు దేవుడి దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని కోర్టు వ్యాఖ్యానించింది.

Must Read: నిర్భయ దోషుల ఉరి: దేశ చరిత్రలోనే తొలిసారిగా..

మరణ శిక్షను వాయిదా వేయాలని నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లో బలం చేకూర్చే అంశాలేవీ లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. విడాకులు కోరుతూ దోషి అక్షయ్ థాకూర్ భార్య దాఖలు చేసిన పిటిషన్‌కు, మరణ శిక్షను వాయిదా వేయడానికి సంబంధం లేదని తెలిపింది. మీరు ఇవాళ మూడు కోర్టుల చుట్టూ తిరిగారు... రాత్రి 10 గంటలైనా వాదనలు వింటున్నామని నిర్భయ దోషుల తరఫు లాయర్‌కు హైకోర్టు గుర్తు చేసింది.

డాక్యుమెంట్లన్నీ సమర్పించడానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ సింగ్ అడగ్గా... ఇప్పటికే నాలుగుసార్లు డెత్ వారంట్లు జారీ చేసిన విషయాన్ని న్యాయమూర్తి మన్మోహన్ ప్రస్తావించారు. మీ దగ్గర బలమైన పాయింట్ ఉంటే చెప్పండని నిర్భయ దోషుల లాయర్‌ను జడ్జి కోరారు. వ్యవస్థతో ఎవరో ఆటలాడుకుంటున్నారంటూ జడ్జి అసహనం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా మీరేం చేస్తున్నారని లాయర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.

క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడంలో ఆలస్యం చేయడంలో కుట్ర ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అంతా ముగిసిపోయిందన్న ధర్మాసానం.. లాయర్ వాదనలను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. కావాలంటే మీరు ఉదయం 5.30 గంటల వరకు (దోషులను ఉరి తీసే సమయం) వాదనలు వినిపించొచ్చని న్యాయమూర్తి సూచించారు. దీంతో ఏపీ సింగ్ బదులు మరో లాయర్ ఖవాజా వాదనలు వినిపించినా ఫలితం లేకపోయింది.

నిర్భయ దోషుల ఉరి ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఈ నలుగురు దోషులు.. క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్, రివ్యూ పిటిషన్లు ఒక్కొక్కరుగా దాఖలు చేస్తూ.. మూడుసార్లు డెత్ వారంట్ జారీ చేసినప్పటికీ మరణ శిక్షను వాయిదా వేయించగలిగారు. ఇప్పుడు మరోసారి అదే ఉద్దేశంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.