యాప్నగరం

గవర్నర్ నివాసంలోనే మంత్రి నిరాహార దీక్ష!

సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన హై ఓల్టేజ్ రాజకీయ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తమ డిమాండ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించనందుకు నిరసనగా ఆయన నివాసం ఎదుటే ఢిల్లీ మంత్రులు బైటాయించారు.

TNN 12 Jun 2018, 2:08 pm
సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన హై ఓల్టేజ్ రాజకీయ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తమ డిమాండ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించనందుకు నిరసనగా ఆయన నివాసం ఎదుటే ఢిల్లీ మంత్రులు బైటాయించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి సోమవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించిన మూడు డిమాండ్లపై ఎల్జీ అభ్యంతరం తెలపడంతో వాటికి ఆమోదం తెలిపేవరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని మంత్రులు భీష్మించుకు కూర్చున్నారు. ఇదే సమయంలో రాజ్‌నివాస్‌లోనే ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తనకు తానుగా చేయలేదని, ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu మంత్రి సత్యేందర్ జైన్


దీంతో చాలా మంది ఐఏఎస్‌ల నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఒకవేళ, వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీచేయడం కొత్త వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. కేజ్రీవాల్‌తో మాట్లాడేందుకు సైతం ఎల్జీ నిరాకరించడంతో అర్థరాత్రి వరకూ వెయిటింగ్ రూమ్‌లోనే ఉన్నారు. గవర్నర్ వైఖరికి నిరసనగా మంత్రులు ధర్నాకు దిగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీరికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎలాంటి కారణం లేకుండా ధర్నాకు దిగారని గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

మంత్రుల నిరసన సాగుతుండగానే మరోవైపు ముఖ్యమంత్రి నివాసానికి ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తమ పాలన సాగుకుండా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, అవినీతి నిరోధక శాఖలను తమ మంత్రులపైకి ఉసిగొల్పుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ మంత్రులపై 14 కేసులు పెట్టారని, వారి బంధువులను రోజుకో కేసులో ఇరికిస్తున్నారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.