యాప్నగరం

తండ్రి మృతి: మోడీ, ఉర్జిత్‌లే కారణమన్న కొడుకు

తన తండ్రి మృతికి మోడీ, ఉర్జిత్ పటేల్ లే కారణమని ఓ వ్యక్తి ఆరోపించాడు.

TNN 24 Nov 2016, 6:41 pm
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట, బ్యాంకుల ఎదుట పెద్ద క్యూలైన్లలో నిల్చుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడితో 11 మంది బ్యాంకు అధికారులు కూడా మరణించారు. కాగా తాజాగా గుంటూరులోని ఫిరంగిపురంలో పోలంకి ఇన్నయ్య అనే వ్యక్తి ఏటీఎం క్యూలైన్లో నిల్చున్నాడు. దాహం వేయడంతో పక్కనే ఉన్న పండ్ల జ్యూస్ సెంటర్ కు వెళ్లి నీళ్లు తాగాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. తన తండ్రి మృతికి ప్రధాని మోడీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ లే కారణమని ఇన్నయ్య కొడుకు సుందర్ రావు ఆరోపించాడు. ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్టు చెప్పాడు. పెద్ద దిక్కును కోల్పోయిన తన కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వినతి పత్రంలో కోరాడు.
Samayam Telugu demonetization case filed against pm modi and rbi governor urjit patel in guntur
తండ్రి మృతి: మోడీ, ఉర్జిత్‌లే కారణమన్న కొడుకు


ఇప్పటివరకు క్యూలైన్లలో నిలబడి చనిపోయిన సామాన్య ప్రజల సంఖ్య 50 దాటింది. వీళ్ల కుటుంబీకులెవరూ కూడా ఈ రకంగా కేసు పెట్టే యోచన చేయలేదు. సుందర్రావు మాత్రం తమకు న్యాయం జరగాల్సిందేనని, ఇది తనలాంటి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని చెప్పారు. నోట్ల రద్దును సూచించిన ఉర్జిత్, ఆ సూచనను ఆమోదించి ప్రకటించిన మోడీ ఇద్దరూ తన తండ్రి చావుకు కారణమని ఆయన అన్నాడు.

ఈ విషయంపై ఫిరంగిపురం ఎస్ఐ మాట్లాడుతూ... పోలంకి ఇన్నయ్య ఫ్రూట్ జ్యూస్ సెంటర్ దగ్గర మరణించాడని, క్యూలైన్లో కాదని చెప్పారు. అతని కొడుకు పెట్టిన ఫిర్యాదు తమకు అందలేదని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.