యాప్నగరం

మోదీని భూతంలా చూపలేం.. జైరాం రమేశ్‌కి బాసటగా కాంగ్రెస్ నేతలు

PM Modi | ప్రధాని మోదీని అన్నివేళలా భూతంలా చూపలేమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు జైరాం రమేశ్‌కు బాసటగా నిలుస్తున్నారు.

Samayam Telugu 23 Aug 2019, 5:04 pm
ప్రధాని నరేంద్ర మోదీని అన్నిసార్లూ భూతంలా చూపలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ వ్యాఖ్యానించారు. అలా చేయడం వల్ల ప్రధానిని ఎదుర్కోలేమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం విధానం పూర్తి ప్రజావ్యతిరేకంగా ఏమీ లేదని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వ పనితీరును గుర్తించకుండా.. అన్ని సార్లూ ఆయన్నో భూతంలా చూపే ప్రయత్నం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. జైరాం రమేశ్‌కు శశి థరూర్, అభిషేక్ సింఘ్వీ లాంటి నేతలు కాంగ్రెస్ సీనియర్ నేతకు బాసటగా నిలుస్తున్నారు.
Samayam Telugu pm modi jairam ramesh


గురువారం ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన జైరాం రమేశ్.. అంశాల వారీగా విమర్శించాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని మోదీ సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు ప్రారంభించిన పీఎం ఉజ్వల యోజనపై ఆయన ప్రశంసలు గుప్పించారు. గత ఐదేళ్లలో మోదీ సర్కారు చేసిన పనులను గుర్తించాలన్న కాంగ్రెస్ నేత.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 37.5 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఎన్డీయేకి 45 శాతం ఓట్లు పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రజలకు చేరువయ్యే భాషలో మాట్లాడతారంటూ ప్రధాని మోదీపై జైరాం రమేశ్ ప్రశంసలు గుప్పించారు. మోదీ చేసే పనుల్ని ప్రజలు గుర్తించి, మనం గుర్తించపోతే.. ఆయన్ను మనం ఎదుర్కోలేమన్నారు. మోదీని పొగడాలని నేను ఎవర్నీ కోరడం లేదు. కానీ ఆయన పాలనను, చేసిన మంచి పనులను గుర్తించాలని కోరుతున్నానని తెలిపారు.

ఎన్నికల ప్రచారం మేం రైతుల సమస్యల గురించి మాట్లాడాం. జనం కూడా రైతులు ఇబ్బందులు పడ్డుతున్నారని గుర్తించారు. కానీ ఆ సమస్యలన్నింటికీ ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని భావించారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనందరికీ తెలుసని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
‘‘ఆరేళ్లుగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించాను. కానీ మోదీ మంచి పనులు చేసినప్పుడు లేదా మంచిగా మాట్లాడినప్పుడు ఆయన్ను ప్రశంసించాలి. అలా చేయడం వల్ల.. మోదీ తప్పు చేసినప్పుడు మనం చేసే విమర్శలకు విశ్వసనీయత వస్తుంద’’ని కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు.

‘‘ప్రతిసారి మోదీని భూతంలా చూపించడం సరికాదు. ప్రతిపక్షం ఏకపక్షంగా విమర్శించడం వల్ల ఆయనకు లబ్ధి చేకూరుతుంద’’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్ నేతల వైఖరి మారడాన్ని గమనిస్తుంటే.. ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఉన్న సహృద్భావపూరిత వాతావరణం గుర్తొస్తోంది.

Read Also: నవ భారతాన్ని ఎవరూ ఆపలేరు: మోదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.