యాప్నగరం

Karnataka: ప్రసాదం తిని 11 మంది భక్తుల మృతి

కర్ణాటకలోని ప్రముఖ ఆలయంలో జరిగిన వేడుకలకు హాజరైన భక్తులు ప్రసాదం తినడంతో విషాదం నెలకొంది.

Samayam Telugu 14 Dec 2018, 9:08 pm
కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ప్రసాదం తిని 11 మంది భక్తులు చనిపోగా, దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 18 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. చమరాజనగర్ ఎస్పీ ధర్మేంద్ర కుమార్‌ మీనా కథనం ప్రకారం.. సులివాడి గ్రామంలోని మారెమ్మ ఆలయంలో గోపురం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వందలాదిగా భక్తులు మారెమ్మ ఆలయంలో కార్యక్రమానికి హాజరయ్యారు.
Samayam Telugu Karnataka.


పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న తర్వాత భక్తులు అస్వస్థతకు లోనై వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మంది భక్తులు చనిపోగా, అందులో ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులను మెరుగైన వైద్యం కోసం మైసూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రసాదం తిన్న మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి.

రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సీఎం కుమారస్వామి
ప్రసాదంలో విషం లాంటి పదార్థం కలిసి ఉండొచ్చునని జిల్లా ఆరోగ్య అధికారి ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రసాదంలో కిరోసిన్ వాసన వచ్చిందని కొందరు భక్తులు చెప్పగా.. అది కాదని వైద్యాధికారి కొట్టిపారేశారు. ప్రసాదం శాంపిల్స్‌ను పరీక్షించేందుకు పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. మృతులను గోపియమ్మ (55), పప్పన్న (50), శాంత (20), అనిత (14), అనిల్ (12)గా గుర్తించారు. మరికొందరు భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.