యాప్నగరం

సుప్రీం కోర్టు సీజేగా దీపక్ మిశ్రా ప్రమాణం..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం (ఆగస్టు 28)..

TNN 28 Aug 2017, 1:55 pm
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం (ఆగస్టు 28) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మిశ్రా 2018 అక్టోబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ జే.ఎస్‌. ఖేహర్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు 27న పదవీ కాలం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu dipak misra sworn in as new chief justice of india
సుప్రీం కోర్టు సీజేగా దీపక్ మిశ్రా ప్రమాణం..


ఒడిశాలో జన్మించిన దీపక్ మిశ్రా.. 1977 ఫిబ్రవరిలో న్యాయవాదిగా తన కెరీర్ మొదలు పెట్టారు. 1996లో ఒడిశా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2010లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2011 అక్టోబరు 10 నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలని తీర్పునిచ్చింది మిశ్రాయే కావడం గమనార్హం.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తొలగింపు, యాకుబ్‌ మెమన్‌కు శిక్ష విధించడం, ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను శిక్షించడం, బాబ్రీ మసీదు, కావేరి జల వివాదం లాంటి కీలక కేసుల్లో మిశ్రా తీర్పులు వెలువరించారు. నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీలో ఛైర్మన్‌గా సేవలందించిన మిశ్రా.. పేదలకు న్యాయ సహాయం అందించడంతో పాటు రాష్ట్రాలకు లీగల్‌ అసిస్టెంట్స్‌ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.