యాప్నగరం

Indian Army Day: ఆర్మీ డే ఇవాళే ఎందుకు జరుపుకుంటారు ? ఈరోజుకున్న ప్రత్యేకతేంటో తెలుసా !

Indian Army Day: జనవరి 15కు ఓ ప్రత్యేకత ఉంది. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరిస్తూ.. ప్రతి ఏడాది జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా నిర్వహిస్తారు. అసలు ఇవాళే ఎందుకు నిర్వహిస్తారు. ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

Authored byసందీప్ పూల | Samayam Telugu 15 Jan 2023, 10:31 am

ప్రధానాంశాలు:

నేడు ఇండియన్ ఆర్మీ డే
బెంగళూరులో ఘనంగా వేడుకలు
ఇవాళే వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా !
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Indian Army Day
ఆర్మీ దినోత్సవం
Indian Army Day: దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పులకించేపోయే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. ఎముకలు కొరికే చలిని, దహించే వేడి, తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేనల నుంచి దేశానికి కాపాలాగా.. ఉండే యోధులు మన జవాన్లు. ఓ వైపు బాంబుల మోతలు, బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్టసమయాల్లో మన సైనికులు ప్రదర్శించే ధైర్యసాహసాలు అసామాన్యం. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. అసలు ఈరోజునే ఆర్మీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చూద్దాం.
భారత సైన్యం అధికారికంగా స్వాతంత్ర్యానికి పూర్వం ఏప్రిల్ 1, 1895న స్థాపించబడింది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశానికి చెందిన ఒక కమాండర్‌కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటున్నారు. 1949లో ఇండియాకు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కోదండెరా కిప్పర్ మదప్ప కరియప్ప (KM Carriappa) ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజను దేశాన్ని రక్షించటంలో కీలక పాత్ర పోషించే భారత సైన్యం యెుక్క శౌర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు.

కర్ణాటకు చెందిన కరియప్ప 1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో వెస్ట్రన్ ఫ్రంట్‌కు కమాండర్‌గా యుద్ధంలో విధులు నిర్వర్తించారు. భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన ఇద్దరు వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి సామ్ మానేక్ష. బ్రిటన్‌లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి ఇద్దరు భారతీయులలో కరియప్ప ఒకరు. భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్, వెస్టర్న్ కమాండ్స్‌ కమాండర్‌గా పనిచేశారు.

ఈ ఏడాది మనం 75వ ఆర్మీ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. గత సంవత్సరం వరకు ఆర్మీ దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించగా.. మెుదటి సారిగా ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలు అందజేస్తారు. కవాతులు, సైనిక ప్రదర్శనలతో ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకుంటారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.