యాప్నగరం

కుక్క ఆత్మహత్య.. యజమాని మరణాన్ని తట్టుకోలేక!

Uttar Pradesh: తన యజమాని మరణవార్త విని శునకం తీవ్ర మనోవేదనకు గురైంది. భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

Samayam Telugu 3 Jul 2020, 5:23 pm
ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న యజమాని ఇక లేదని తెలియడంతో.. ఆ శునకం ఇక తనకు జీవితం వ్యర్థమనుకుంది. యజమాని మృతదేహాన్ని చూడగానే.. పరుగు పరుగున భవనం నాలుగో అంతస్తు పైకి చేరి అక్కడి నుంచి దూకేసింది. అక్కడికక్కడే మరణించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని కదిలిస్తోంది.
Samayam Telugu శునకం ఆత్మహత్య
Dog Suicide In Uttar Pradesh


కాన్పూర్‌లో వైద్య శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనితా రాజ్ సింగ్ 12 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. పుట్టిన ఒకట్రెండు రోజుల్లోనే తల్లి నుంచి విడిపోయిన ఆ కుక్క పిల్ల పోషణ లేక చిక్కి శల్యమైంది. దాని శరీరం చుట్టూ కీటకాలు ముసురుతున్నాయి. అలాంటి స్థితిలో ఆ కుక్క పిల్లను తీసుకొచ్చిన డాక్టర్ అనిత.. దానికి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపారు. దానికి ‘జయ’ అని పేరు పెట్టి కుటుంబంలో ఓ సభ్యురాలిగా పెంచుకున్నారు.

అనారోగ్య కారణాలతో డాక్టర్ అనితా సింగ్‌ను కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి ఆ శునకం ఇంట్లో దిగాలుగా కూర్చుంది. యజమాని ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ అనితా సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం (జులై 1) ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహాన్ని కాన్పూర్‌లోని బరా-2 పరిధిలోని మాలిక్‌పురంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకొచ్చారు.

12 ఏళ్లుగా తనను పెంచి పోషించిన యజమానిని విగతజీవిగా చూడగానే ఆ శునకం దిగ్భ్రాంతికి గురైంది. భవనం నాలుగో అంతస్తు పైకెక్కి అక్కడ నుంచి ఒక్కసారిగా దూకేసింది. అది చూసి వైద్యురాలి కుటుంబసభ్యులు హతాశులయ్యారు. తీవ్రంగా గాయపడిన శునకాన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించిందని చెప్పారు. వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.

శునకాన్ని తన తల్లి ఇంట్లో ఓ సభ్యురాలిగా చూసుకున్నారని వైద్యురాలి కుమారుడు తేజాస్ తెలిపాడు. తన తల్లి మరణాన్ని తట్టుకోలేకే అది ప్రాణాలు విడించిందని చెప్పాడు. డాక్టర్ మరణాన్ని తట్టుకోలేక భవనం పైనుంచి దూకి శునకం ప్రాణాలు తీసుకుందని తెలియడంతో స్థానికులు అక్కడికి పోటెత్తారు. వైద్యురాలిపై ఆ మూగజీవి పెంచుకున్న ప్రేమను చూసి షాక్‌కు గురయ్యారు. వైద్యురాలి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ శునకం మృతదేహాన్ని ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు.

Also Read: జవాన్లలో ధైర్యం నింపిన మోదీ.. చైనా ఉలికిపాటు

Don't Miss: యుద్ధ విమానాలు, క్షిపణులు.. రూ.38,900 కోట్లతో సైన్యానికి సరికొత్త అస్త్రాలు

Also Read: మట్టి కింద 162 మంది సమాధి.. మయన్మార్‌లో ఘోర విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.