యాప్నగరం

స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీల గుర్తింపు బాధ్యత రాష్ట్రాలదే: సుప్రీం

దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు వందల కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించాయి.

Samayam Telugu 9 Jul 2020, 1:45 pm
లాక్‌డౌన్ వేళ వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై గురువారం నాటి విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యతేని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
Samayam Telugu వలస కూలీల తరలింపుపై సుప్రీం వ్యాఖ్యలు
Supreme Court on Migrants


వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా నిర్వహణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. వలస కూలీల అంశంపై వారం రోజుల్లో సమగ్రంగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. అంతేకాదు, మహారాష్ట్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వాలని ఆ రాష్ట్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. తదుపరి విచారణను జులై 17కి వాయిదా వేసింది.

‘మీ అఫిడవిట్ సక్రమంగా లేదు.. అఫిడవిట్ దాఖలు చేయమంటే మీ తరపున స్టేట్‌మెంట్ ఇవ్వడం కోసం కాదు. మహారాష్ట్రలో వలస కార్మికుల సమస్య లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో మేము ఏకీభవించలేం. సరైన వివరాలతో దాఖలు చేయమని మీరు రాష్ట్రానికి సలహా ఇవ్వాలి’ అని జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు.

వలస కార్మికుల రాజ్యాంగ హక్కులను రక్షించాలంటూ పలువురు సీనియర్ న్యాయవాదులు సుప్రీంను కోరారు. వలస కార్మికుల ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయని, వేలాది మంది రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకున్నారు.. ఈ సంక్షోభం నుంచి వారిని బయటపడేయడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవడం దృష్టిసారించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.