యాప్నగరం

మమతా బెనర్జీ సోదరుడి సంచలన వ్యాఖ్యలు.. బెంగాల్‌లో బీజేపీ బిగ్ స్కెచ్..?

బెంగాాల్ ఎన్నికల కోసం పక్కా స్కెచ్‌లు వేస్తున్న బీజేపీ.. ఈసారి మమతా బెనర్జీ సొంత కుటుంబంపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. సీఎం సోదరుడు చేసిన వ్యాఖ్యలు దీన్నే సూచిస్తున్నాయి.

Samayam Telugu 13 Jan 2021, 8:50 pm
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఒకదానికి మించి మరొకటి ఎత్తులు వేస్తున్నాయి. టీఎంసీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీఎంసీ కీలక నేత సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఇప్పటికే మమతా బెనర్జీ ఒత్తిడిలో ఉండగా.. ఆమెకు షాకిచ్చేలా సొంత తమ్ముడే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu mamata banerjee-kartik banerjee
Image: Twitter


పశ్చిమ బెంగాల్‌లో వారసత్వ రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని మమత సోదరుడు కార్తీక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలను బాగు చేయాలని మాట్లాడుతూ.. తమ సొంత కుటుంబ సభ్యుల జీవితాలను మెరుగుపర్చుకుంటున్న రాజకీయ నాయకుల తీరుతో విసిగిపోయానంటూ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్తీక్ బీజేపీలో చేరి పొలిటికల్ లైఫ్ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. మీ సోదరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా..? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాల్లో వంచన గురించి నేను మాట్లాడుతున్నానంటూ ఆయన బదులిచ్చారు. ప్రజల కోసం, వారి జీవితాలను మెరుగుపర్చడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రజా సేవలో ఉన్నవారు.. జనం గురించి ముందు ఆలోచించి.. తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలన్నారు.

మీరు బీజేపీలో చేరబోతున్నారా అని ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఆయన తెలివిగా సమాధానం ఇచ్చారు. కార్తీక్ వ్యాఖ్యలు చూస్తుంటే.. బెంగాల్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇప్పుడు మమతా ఫ్యామిలీపైనే కన్నేసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.