యాప్నగరం

మహిళపై ఆ ఏనుగుకు ఎందుకంత కోపం.. ఒడిశాలో షాకింగ్ ఘటన

Elephant Attack on Woman and Dead Body: ఒడిశాలో ఓ ఏనుగు ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు 70 ఏళ్ల ఓ మహిళపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ ఏనుగు మరోసారి వచ్చి దాడి చేసింది. వృద్ధురాలి మృతదేహాన్ని చితి పైనుంచి లాగి కిందపడేసి తొక్కింది. ఏనుగు విపరీత ప్రవర్తనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 13 Jun 2022, 5:21 pm
జరాజులు జనావాసాల్లోకి రావడం, ఇళ్లపై, పంటలపై స్థానికులపై దాడి చేస్తూ నానా బీభత్సం చేయడం తరచూ చూస్తుంటాం. ఇలాగే ఒడిశాలోని ఓ గ్రామంలోకి వచ్చిన ఏనుగు మాత్రం వింతగా ప్రవర్తించింది. బావి నుంచి మంచినీళ్లు తోడుకుంటున్న 70 ఏళ్ల ఓ మహిళపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ ఏనుగు మరోసారి వచ్చి దాడి చేసింది. వృద్ధురాలి మృతదేహాన్ని చితి పైనుంచి లాగి కిందపడేసి తన ప్రతాపం చూపింది. ఏనుగు వింత, విపరీత ప్రవర్తనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Representational Image


ఒడిశా మయుర్‌భంజ్‌ జిల్లా రాయ్‌పాల్‌ గ్రామంలో మూడు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. దాల్మా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి ఏ ఏనుగు దారితప్పి వచ్చింది. రాయ్‌పాల్ గ్రామంలో ప్రవేశించింది. ఆ సమయంలో మాయా ముర్ము (70) అనే మహిళ గొట్టపుబావి నుంచి మంచి నీటిని తోడుకుంటున్నారు. ఆ మహిళను చూడగానే.. ఏనుగు ఆమెపై దాడి చేసింది. తొండంతో లాగి కిందపడేసి తొక్కడంతో మాయా తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు అప్రమత్తమై ఏనుగును తరిమేసి మాయాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మాయా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన బంధువులు, గ్రామస్థులు అదే రోజు సాయంత్రం అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆ ఏనుగు మరోసారి అక్కడికి వచ్చింది. అక్కడున్న వారంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. చితిపై ఉన్న మాయా మృతదేహంపై దాడి చేసిన ఆ గజరాజు.. మృతదేహాన్ని కింద పడేసి తొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏనుగు వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత మాయా అంత్యక్రియలు పూర్తిచేసినట్లు గ్రామస్థుల్లో ఒకరు తెలిపారని ఎన్డీటీవీ ఓ కథనంలో పేర్కొంది. మాయా విషయంలో ఏనుగు ఎందుకలా ప్రవర్తించిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also Read:

రూ.22 వేలు కట్నం ఇచ్చి మరీ ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు..!
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.