యాప్నగరం

విద్యార్థినిని రూమ్‌కు పిలుపించుకొని.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు?

Varanasi Girl Student: యూపీ బీజేపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మయా శంకర్ పాఠక్ వివాదంలో చిక్కుకున్నారు. పాఠక్ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆరోపించింది.

Samayam Telugu 11 Jan 2021, 5:55 pm
బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మయా శంకర్‌ పాఠక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ విద్యార్థిని ఆరోపించడం ఉత్తర్ ప్రదేశ్‌లో అలజడి రేపుతోంది. పాఠక్‌కు చెందిన కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. పాఠక్ తనను ఆయన రూమ్‌లోకి పిలుపించుకున్నాడని.. మొదట తనపై దాడి చేసి, ఆపై లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన 8 రోజుల కింద చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిని పోస్టు చేసిన వీడియో ద్వారా బయటకు వచ్చింది.
Samayam Telugu మాజీ ఎమ్మెల్యే మయా శంకర్
Uttar Pradesh BJP


మయా శంకర్ పాఠక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు చెప్పుకొని బోరుమంది. దీంతో కుటుంబసభ్యులు, కొంత మంది స్థానికులు మొత్తం 10 మంది కలిసి పాఠక్ కార్యాలయానికి వచ్చి ఆయణ్ని నిలదీశారు. దీంతో ఆయన వారికి క్షమాపణ చెప్పినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత వాళ్లు పాఠక్‌పై దాడి చేశారు. విద్యార్థిని కుటుంబసభ్యులు కొడుతుండగా పాఠక్ తన ముఖానికి, చెవులకు చేతులను అడ్డంగా పెట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది.

మయా శంకర్ పాఠక్ వయసు 70 ఏళ్లు. బీజేపీలో సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విద్యాసంస్థలను స్థాపించి వాటికి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. వారణాసి సమీపంలోని భగటా ప్రాంతంలో ఆయనకు ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.

తనపై కుట్ర పూరితంగానే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని పాఠక్ ఆరోపించారు. ‘సదరు విద్యార్థిని 8 రోజుల కిందట నా వద్దకు వచ్చింది. ఆమె గణతంత్ర దినోత్సవ (జనవరి 26) స్పీచ్‌కు సన్నద్ధమవుతోంది. ప్రసంగం సరిగా లేదని ఆమెను మందలించాను. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులు వచ్చి నాపై దాడి చేశారు’ అని పాఠక్ అన్నారు.

కొంత మంది రాజకీయ, కుల సంఘాల నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తు్న్నారని పాఠక్ చెబుతున్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘వారు (విద్యార్థి కుటుంబ సభ్యులు) నాపై దాడి చేస్తున్నప్పుడు వీడియో తీశారు. అది నేను గమనించలేదు. విద్యార్థిని మందలించినందుకు వారిని నేను క్షమాపణ చెప్పాను. దాన్ని వక్రీకరించారు. రాజకీయంగా బురద చల్లడానికి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన చెప్పుకొచ్చారు.

బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులు పాఠక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇటు దాడి ఘటనపై పాఠక్ కూడా ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. మరోవైపు పాఠక్‌కు బీజేపీతో సంబంధాలు లేవని.. ఆయన చాలాకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.