యాప్నగరం

కాలేజీ ప్రిన్సిపల్‌పై విద్యార్థి కాల్పులు

కాలేజీ ప్రిన్సిపల్‌పైనే తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడో విద్యార్థి. తనను కాలేజీ నుంచి బహిష్కరించాడన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.

Samayam Telugu 30 Aug 2018, 3:04 pm
కాలేజీ ప్రిన్సిపల్‌పైనే తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడో విద్యార్థి. తనను కాలేజీ నుంచి బహిష్కరించాడన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిజ్నూర్‌ జిల్లాలోని నార్వాలికి చెందిన దీపాన్షు కుమార్ పదవ తరగతి విద్యార్థి. అతడు గతంలో ప్రియాంక స్కూల్‌లో టెన్త్ చదవగా.. గతేడాది పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మళ్లీ 15 రోజుల క్రితం రూపూర్‌లోని శ్రీసాయి ఇంటర్ కాలేజీలో మళ్లీ పదవ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు.
Samayam Telugu Gun


కాలేజీలో చేరిన దగ్గర నుంచి తోటి విద్యార్థులతో గొడవపడుతున్నాడు. తరచూ ఏదొక వివాదంలో ఉంటున్నాడు. ఈ నెల 25న ఓ విద్యార్థితో గొడవపడి.. దాడి చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లగా.. దీపాన్షును స్కూల్ నుంచి బహిష్కరించారు. బుధవారం నాడు దీపాన్షు తన తల్లితో కలిసి కాలేజీకి వెళ్లాడు. తిరిగి కాలేజీకి అనుమతించాలని కోరగా.. ప్రిన్సిపల్ తిరస్కరించారు. చేసేదేమీ లేక తల్లీకొడుకులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ప్రిన్సిపల్‌ సంజీవ్‌ కుమార్2పై దీపాన్షు కోపం పెంచుకున్నాడు.

దీపాన్షు కొద్దిసేపటి తర్వాత తిరిగి స్కూల్‌కు వెళ్లాడు. నేరుగా ప్రిన్సిపల్ ఉన్న గదికి వెళ్లి.. తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీ తీసి ప్రిన్సిపల్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ సంజీవ్ కుమార్ భుజంలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్ధం వినపడటంతో స్టాఫ్, విద్యార్థులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వెంటనే దీపాన్షు అక్కడి నుంచి పారిపోగా.. గాయపడిన ప్రిన్సిపల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.