యాప్నగరం

పాక్‌తో చర్చలకు ఎలాంటి సమస్యా లేదు, కానీ...

కశ్మీర్ అంశం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని భారత్ పదే పదే అంతర్జాతీయ సమాజానికి తేల్చిచెబుతోన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Sep 2019, 3:36 pm
పాకిస్థాన్‌తో చర్చలకు తమకెలాంటి సమస్యలేదు కానీ, ఆ దేశంతో ఉన్న సమస్యల్లా ఉగ్రవాదమేనని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆసియా సొసైటీ అనే సాంస్కృతిక సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఆయన మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 ని రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని నిర్ణయించామని, ఇది చైనా, పాకిస్థాన్‌కు కంటగింపు కలిగించిందని జయశంకర్ వ్యాఖ్యానించారు. దీనికి పర్యవసానంగా పాక్‌లోని భారత హైకమిషనర్‌ను బహిష్కరించి దౌత్య సంబంధాలను మరింత కుదించిందని పేర్కొన్నారు.
Samayam Telugu shankar


అలాగే చైనా సైతం కశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించిందని, ప్రస్తుత పరిస్థితులపై సంయమనం పాటించాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఉద్రిక్తతలను నివారించి సాధారణ స్థితికి తీసుకొస్తామని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత దౌత్య సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇది తమ అంతర్గత వ్యవహారమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో పాక్, చైనాలు భిన్నంగా స్పందించాయని, ముఖ్యంగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఆయన దుయ్యబట్టారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే పాకిస్థాన్ గత 70 ఏళ్లపాటు ఉగ్రవాదం కోసం చేసిన ఖర్చంతా వృథాగా పోతుందని బాధపడుతోందని ఎద్దేవా చేశారు. కాబట్టే వివిధ మార్గాల్లో పాకిస్థాన్ తన ఆగ్రహం, అసహనాన్ని వ్యక్తం చేస్తోంది, దీర్ఘకాలిక లక్ష్యంతో ఉగ్రవాద సామ్రాజ్యాన్ని నిర్మించిందని జయశంకర్ ధ్వజమెత్తారు.

కశ్మీర్ అంశం కంటే పాకిస్థాన్ పెద్ద సమస్యని, ఆవిర్భావం నుంచి ఉగ్రవాదాన్నే తన విధానంగా మలచుకుందని దుమ్మెత్తిపోశారు. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని, వారి ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్లే అక్కడ దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మంత్రి వివరించారు. కశ్మీర్ అంశంపై చర్చలకు ముందు పాకిస్థాన్‌కు ఎలాంటి షరతులు విధిస్తారన్న ప్రశ్నకు స్పందించిన జయశంకర్.. ఇది పూర్తిగా అర్ధరహితమని, తొలుత పాక్ తన పౌరుల మంచి కోసం ఏదైనా చేయాల్సిన ఉంటుందని, అలాచేసినప్పుడే సాధారణ దేశంగా తమతో సంబంధాలని కొనసాగిస్తుందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.