యాప్నగరం

చావడమో.. గెలవడమో, పట్టువీడని రైతు.. ప్లకార్డు వైరల్

Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులు పట్టు సడలించడం లేదు. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇంటికి తిరిగి వెళ్లేదని తేల్చి చెబుతున్నారు. విజయమో, వీర మరణమో అని రాసిఉన్న పేపర్ ప్రదర్శించారు.

Samayam Telugu 8 Jan 2021, 11:35 pm
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం (జనవరి 8) జరిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అస్సలు కుదరదని కేంద్రం తేల్చి చెబుతోంది. చట్టాలను ఉపసంహరించుకుంటేనే తాము ఇళ్లకు వెళ్తామని (Law Wapsi - Ghar Wapsi) రైతులు గట్టిగా చెబుతున్నారు.
Samayam Telugu రైతుల ఆందోళన
Farmers protest


చర్చలు ప్రారంభమైన కాసేపటికే కేంద్ర మంత్రులు తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఆ చట్టాలు దేశ ప్రజలందరి కోసం తీసుకొచ్చినవి అని.. ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని మంత్రుల బృందం స్పష్టం చేసింది. ‘చట్టాలను రద్దు చేయలేం.. కావాలంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు’ కేంద్ర మంత్రులు రైతులతో అన్నారు. ఆ చట్టాలు అక్రమమని కోర్టు చెబితే.. అప్పుడు ఉపసంహరించుకుంటామని చెప్పారు.

మంత్రుల వ్యాఖ్యలతో రైతు సంఘాల నేతలు అసంతృప్తికి గురయ్యారు. సుప్రీంకోర్టుకు వెళితే తీర్పు వచ్చే సరికి చాలా సమయం పడుతుందని.. చట్టాలను వెంటనే రద్దు చేయాలని పట్టుబట్టారు. ‘చట్టాలను వెనక్కి తీసుకుంటేనే, మేం ఇళ్లకు వెళ్లిపోతాం’ అని తేల్చి చెప్పారు.

రైతు నాయకుడు


అన్నదాతలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రులు సమావేశ గది నుంచి లేచి, బయటకు వచ్చేశారు. ఇది రైతులను మరింత అసహనానికి గురిచేసింది. రైతు సంఘాల నేతలు కూర్చున్న చోటే ఉండి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఓ రైతు నేత ‘విజయమో.. లేదా వీరమరణమో’ అనే వాక్యం రాసిఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Must Read: వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు?

లంచ్ చేసేందుకు కూడా రైతులు నిరాకరించారు. భోజన విరామ సమయంలో సమావేశ గదిలోనే ఉండిపోయారు. కేంద్రం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ‘చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం మధ్యలో తప్పుకొని సుప్రీంకోర్టు తేలుస్తుందని చెప్పడం దేనికి నిదర్శనం? సుప్రీంకోర్టు నిర్ణయానికే వదిలేస్తే మంచిదని అనడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే’ అని రైతు సంఘాల నేతలు అన్నారు. జనవరి 15న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం ఆహ్వానించింది. ఏం జరుగుతుందో చూడాలి!

Also Read:

రైతులకు సాయం చేసేందుకు వచ్చి సజీవదహనం.. తీవ్ర విషాదం

రైతు ఆత్మహత్య.. నిరసన స్థలంలోనే దహనం చేయాలని నోట్

నేత ఇంటి ముందు పేడ.. ట్రాక్టర్ ట్రాలీతో డంప్, అంత కోపం ఎందుకంటే?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.