యాప్నగరం

Farmers Protest: రైల్వే ట్రాకులను దిగ్బంధిస్తాం: రైతులు - చర్చలకు సిద్ధం: కేంద్రం

Narendra Singh Tomar: తమ డిమాండ్లను పరిష్కరించకుంటే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్దమేనని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటన చేశారు.

Samayam Telugu 11 Dec 2020, 3:31 am
రైతులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. డిమాండ్లను పరిష్కరించకుంటే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని హెచ్చరించారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ, తేదీలను ప్రకటిస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమేనని రైతు నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఢిల్లీ శివారులోని సింఘు వద్ద గురువారం (డిసెంబర్ 10) ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu రైతుల ఆందోళన
Farmers protest


వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, దానిపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదని రైతు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు.. రైతులు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పునరుద్ఘాటించారు.

రైల్వే ట్రాకులను దిగ్బంధం చేస్తారనే హెచ్చరికలో నేపథ్యంలో రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలతో రైతుల భూములకు సంపూర్ణ భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు.

‘రైతుల భూములను పారిశ్రామికవేత్తలు ఆక్రమిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయం కొత్తదేమీ కాదు. గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌, కర్ణాటకలో గత కొన్నేళ్లుగా ఇది కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు’ అని తోమర్ అన్నారు.

‘ఓవైపు కొవిడ్‌ పరిస్థితులు, మరోవైపు విపరీతమైన చలిలో అన్నదాతలు నిరసనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతులు మరోసారి పరిశీలించాలి’ అని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.

Must Read: రైతుల సేవలో చిన్నారులు.. కదిలిస్తున్న దృశ్యం

Also Read: భారత్‌-పాక్ చర్చించుకొని రైతుల సమస్య పరిష్కరించాలి.. బ్రిటన్ ప్రధానికి ఏమైంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.