యాప్నగరం

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా మాజీ క్రికెటర్.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రక్షాళన!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. సొంత పార్టీలో అసమ్మతి ఇబ్బందిగా పరిణమించింది.

Samayam Telugu 15 Jul 2021, 3:22 pm
పంజాబ్ కాంగ్రెస్‌లో విబేధాలు తారాస్థాయికి చేరడంతో అధిష్ఠానం అప్రమత్తమయ్యింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీలో కుమ్ములాటలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో నవజోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యమంత్రిపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రివర్గం నుంచి రెండేళ్ల కిందటే సిద్ధూ వైదొలగిన విషయం తెలిసిందే.
Samayam Telugu నవజోత్ సింగ్ సిద్ధూ
Navjot Sidhu (File photo)


అమరీందర్, సిద్ధూ మధ్య సయోధ్యకు అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించి, దళిత సామాజికవర్గం నుంచి ఒకరు, హిందువుల నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పిస్తారని చెబుతున్నాయి. అలాగే, క్యాబినెట్‌లో ఇద్దర్ని తొలగించి, ముగ్గురు నలుగురు కొత్తవారికి చోటుకల్పించనున్నారు. చరణ్‌జిత్ ఛన్నీ, గుర్‌ప్రీత్ కాంగర్‌‌కు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. స్పీకర్ రానా కేపీ సింగ్, మరో దళిత నేత రాజ్ కుమార్ వెర్కా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

పార్టీలో అసమ్మతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏర్పాటుచేసిన కమిటీకి దళితుల నుంచి ఒకరికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించాలని కొందరు ఎమ్మెల్యేలు విజ్ఞ‌ప్తి చేశారు. గతవారం సీఎం అమరీందర్ సింగ్‌ను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన విషయం తెలిసిందే. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను శిరసావహిస్తానని భేటీ అనంతరం సీఎం వ్యాఖ్యానించారు. అంతకు ముందు రాహుల్, ప్రియాంక గాంధీలను సిద్ధూ కలిశారు. పార్టీలో జరుగుతున్న పరిణమాలను నిశితంగా గమనిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ.. పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఆశించారు. అయితే, చివరకు అమరీందర్ మంత్రివర్గంలో చోటుదక్కింది. కానీ, సీఎంతో విబేధించి రెండేళ్లు తిరక్కుండానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మౌనం వహించారు. ఇటీవల నెలల్లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో విద్యుత్ సమస్యలపై గళమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.