యాప్నగరం

సెప్టెంబర్‌లో కరోనా.. గుండెపోటుతో మాజీ సీఎం కన్నుమూత

Gujarat: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కన్నుమూశారు. గత నెలలో ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. చికిత్స తర్వాత కోలుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ కన్నుమూశారు.

Samayam Telugu 29 Oct 2020, 3:41 pm
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సోమ్‌నాథ్ ఆలయ ట్రస్టు ఛైర్మన్ కేశూభాయ్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. సెప్టెంబర్‌లో ఆయన కరోనా వైరస్‌ బారినపడ్డారు. పటేల్ వద్ద పనిచేసే అటెండర్‌ నుంచి ఆయనకు వైరస్ వ్యాపించింది. అయితే.. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. కానీ, గురువారం (అక్టోబర్ 29) తన నివాసంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయణ్ని స్టెర్లింగ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.55 గంటలకు కేశూభాయ్ పటేల్ కన్నుమూశారు.
Samayam Telugu కేశూభాయ్ పటేల్
Keshubhai Patel death


కరోనా వైరస్ నుంచి కోలుకున్నా.. కొంత మందిలో ఇతర సమస్యలు తిరగబెడుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. వయసు పైబడిన వారిలో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు పలు కేసులను గమనిస్తే తెలుస్తోంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా కరోనా నుంచి కోలుకున్నా.. ఇతర సమస్యలతో కన్నుమూశారు. అయితే.. కేశూభాయ్ పటేల్ మరణానికి కరోనా కారణం కాదని వైద్యులు చెబుతున్నారు.

పటేల్‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే సరికి స్పృహ కోల్పోయి ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించామని చెప్పారు. పటేల్‌ మరణానికి కరోనా కారణం కాదని వెల్లడించారు. గతంలో ఆయనకు కరోనా సోకినా.. కోలుకున్నారని తెలిపారు. కేశూభాయ్ పటేల్ గుండెపోటు కారణంగా కన్నుమూశారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ చేసింది.

కేశూభాయ్ పటేల్ 1928లో గుజరాత్‌లోని జునాగఢ్‌లో జన్మించారు. 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS)లో ప్రచారక్‌గా చేరారు. ఆ తర్వాత ‘జన్‌సంఘ్‌’లో కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బీజేపీ నుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన కేశూభాయ్ పటేల్.. 1995 స్వల్ప కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2001 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అయితే.. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత పటేల్ ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది.

గుజరాత్ అసెంబ్లీకి కేశూభాయ్ పటేల్ ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2012లో బీజేపీని వీడి సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. ‘గుజరాత్ పరివర్థన్‌ పార్టీ’ని స్థాపించిన కేశూభాయ్ పటేల్.. కొంత కాలం తర్వాత దాన్ని తిరిగి బీజేపీలో విలీనం చేశారు. పటేల్ మృతికి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: భారత్‌లో డిసెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. రిజిస్టర్ చేసుకున్న వారికే ఫస్ట్

Must Read: మందు తాగే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.