యాప్నగరం

ఉపాధి హామీ పథకం సృష్టికర్త, కేంద్ర మాజీ మంత్రి రఘవంశ్ ప్రసాాద్ కన్నుమూత

మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోన్న మహోన్నత పథకానికి రూపకల్పన చేసిన సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ కన్నుమూశారు.

Samayam Telugu 13 Sep 2020, 1:51 pm
కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స కొనసాగించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్
Raghuvansh Prasad Singh


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు తన రాజీనామా లేఖను గురువారం పంపారు. ఆర్జేడీ ఆవిర్బావం నుంచి 32 ఏళ్లపాటు ఆ పార్టీలో కొనసాగిన రఘువంశ్ ప్రసాద్.. లాలూకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. రఘువంశ్ ప్రసాద్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీయే-1 ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూపకల్పన జరిగింది.

ప్రస్తుతం ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాది మందికి ఉపాధి అందుతోంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలోనే నిరుపేదలు, వలస కూలీలను ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నాయి. రఘువంశ్ ప్రసాద్ బీహార్‌లోని వైశాలి పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 1996 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన విజయం సాధించిన రఘువంశ్ ప్రసాద్.. 2009 వరకు వరుసగా ఐదుసార్లు జయకేతనం ఎగురువేశారు.

అయితే, 2014, 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఇటీవల కాలంలో ఆర్జేడీకి ఆయన దూరమవుతూ వచ్చారు. నాలుగు రోజుల కిందటే ఆ పార్టీకి రాజీనామా చేశారు. రఘువంశ్ రాజీనామాపై పునరాలోచించాలని, లేఖను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కోరారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి రఘువంశ్ ప్రసాద్ తప్పుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.