యాప్నగరం

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో ప్రమాదం.. జెండాలు కడుతుండగా కరెంట్ షాక్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) చిన్న ప్రమాదం జరిగింది. బళ్లారిలో యాత్రలో కొందరు పార్టీ జెండాలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ వారిని పరామర్శించారు. రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను, వివరాలను రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Oct 2022, 6:50 pm

ప్రధానాంశాలు:

  • బళ్లారిలో సాగుతున్న యాత్ర
  • చికిత్స పొందుతున క్షతగాత్రులు
  • పరిహారం ప్రకటించిన రాహుల్ గాంధీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rahul Gandhi
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ యాత్ర సాగుతున్న కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో చిన్న ప్రమాదం జరిగింది. యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. అది కాస్తా విద్యుత్ లైన్‌కు తగిలింది. దాంతో విద్యుత్ షాక్ తగిలి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా బళ్లారి జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఈ ఘటనలో మోకా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రామన్నతోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర వారిని ఆస్పత్రికి తరలించడంతో.. ప్రాణాపాయం తప్పింది. అయితే రాహుల్ గాంధీ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి.. వారిని పరామర్శించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాల కూడా రాహుల్ గాంధీతో వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు.


ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. జోడో యాత్రలో ఓ దురదృష్టకరమైన ఘటన జరిగిందని, తమ స్నేహితుల్లో కొందరు కరెంట్ షాక్ గురయ్యారని పేర్కొన్నారు. అయితే వారిని వెంటనే బళ్లారి ఆస్పత్రిలో చేర్పించడంతో పెను ప్రమాదం తప్పిందని, వారి ఆత్మస్థైర్యం చూసి తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సంబంధిత ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. రణ్‌దీప్ సింగ్ సుర్జేవాల దీనిపై ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.