యాప్నగరం

కర్ణాటక ఎన్నికలు..గాలి జనార్ధన్ రెడ్డి రీఎంట్రీ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు ఆసక్తిదాయకంగా మారాయి.

Samayam Telugu 28 Mar 2018, 3:47 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు ఆసక్తిదాయకంగా మారాయి. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ.. మధ్యలో జేడీఎస్..ఈ పార్టీల మధ్యన అమీతుమీ పోరాటం సాగుతోంది. త్రిముఖ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారు? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే. అసలు కథ ఏమిటో మే 15వ తేదీకి గానూ పూర్తి స్పష్టత రాదు. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఆ నెల 15న ఫలితాలు వెల్లడవుతాయి.
Samayam Telugu gali


ఆ సంగతలా ఉంటే.. ప్రస్తుతం పార్టీలు బలాబలాలను సమీకరించుకునే పనుల్లో ఉన్నాయి. అభ్యర్థులు ఎంపిక, అభ్యర్థుల జాబితా వడపోత కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. ఈ ఎన్నికలతో గాలి జనార్ధన్ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అనేది. గతంలో జనార్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో ఈయన జైలు పాలయ్యారు.

అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్సీ హోదాతో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం కేసుల్లో చిక్కుకుని చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. అయితే ఎట్టకేలకూ బెయిల్ వచ్చింది. ఈడీ అటాచ్ మెంట్ లో ఉండిన జనార్ధన్ రెడ్డి ఆస్తులు కూడా కొంత కాలం కిందట తిరిగి ఆయన సొంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా కూడా జనార్ధన్ రెడ్డి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బళ్లారి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అయితే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఇంకా ధ్రువీకరించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.