యాప్నగరం

స్టీల్‌ప్లాంట్‌లొ పేలుడు.. 9మంది సజీవదహనం

క్షణాల్లో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున ప్లాంట్‌ను మంటలు కమ్మేశాయి. దుర్గ్ జిల్లాలోని బిలాయిలో బిలాయి స్టీల్ ప్లాంట్ ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 9 Oct 2018, 2:53 pm
స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ అవడంతో ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి, 9 మంది ఉద్యోగులు సజీవదహనం కాగా.. దాదాపు 14 మంది ఉద్యోగులకు కాలిన గాయాలయ్యాయి. మంగళవారం దాదాపు 11:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
Samayam Telugu Bilai Steel Plant Gas Pipeline Blast


దుర్గ్ జిల్లాలోని బిలాయిలో బిలాయి స్టీల్ ప్లాంట్ (బీఎస్‌పీ) ఉంది. ప్లాంట్‌లో 20 మందికి పైగా కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే 11వ బ్యాటరీ వద్ద రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గ్యాస్ పైప్‌లైన్ లీకైంది. తద్వారా క్షణాల్లో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున ప్లాంట్‌ను మంటలు కమ్మేశాయి. మంటల్లో చిక్కుకుని 9 మందికి పైగా చనిపోయి ఉంటారని, మరో 14 మంది కార్మికులు గాయపడ్డట్లు స్టీల్ ప్లాంట్ ప్రతినిధి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
గాయపడ్డవారిని బిలాయి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో 5 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగ కారణంగా ప్లాంట్‌లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది త్వరగా బయటకు తీసుకురాలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రమాదం సంభవించిన బిలాయి స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.