యాప్నగరం

భారత్, యూకే సహా ఐదు దేశాలపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ

భారత్‌లో రెండో దశ వ్యాప్తికి డెల్టా వేరియంట్ కారణమైనట్టు ప్రభుత్వ పరిశోధనలో వెల్లడయ్యింది. భారత్‌లో పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సాయానికి ముందుకొచ్చాయి.

Samayam Telugu 6 Jul 2021, 3:10 pm
భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో భారత్‌పై విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. తాజాగా, భారత్‌ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని జర్మనీ ఎత్తివేసింది. భారత్, యూకే సహా ఐదు దేశాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్టు జర్మనీ ప్రకటించింది. డెల్టా వేరియంట్‌తో ప్రభావితమైన ఐదు దేశాల ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Image used for representational purpose only


జర్మన్‌ వాసులే కాకుండా ఈ దేశాలకు చెందిన పౌరులకు కూడా తమ దేశంలో ప్రవేశించవచ్చని చెప్పారు. నిషేధం ఎత్తివేసిన దేశాల్లో భారత్, యూకే, నేపాల్, రష్యా, పోర్చుగల్ ఉన్నాయి. ఎత్తివేసిన ఆంక్షలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. తమ దేశంలో కొత్త వేరియంట్‌లు విస్తృతంగా వ్యాపించకుండా అడ్డుకోడానికి జర్మనీ ‘వైరస్ వేరియంట్ కంట్రీ’ ట్రావెల్ వర్గాన్ని ప్రవేశపెట్టింది.

జర్మనీలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, అంటే ఆ వేరియంట్ కారణంగా దెబ్బతిన్న దేశాల ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయవచ్చని గతవారం జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాహ్ అన్నారు. డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితులను గమనిస్తామని అన్నారు.

బ్రిటన్ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు శుక్రవారం లండన్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకేతాలిచ్చారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా క్యారంటైన్‌లో ఉండాలని గత నెలలో మెర్కెల్ ఆంక్షలు విధించారు. భవిష్యత్తులో రెండు డోస్‌ల టీకాలు వేసుకున్నవారు క్యారంటైన్‌లో లేకుండా ప్రయాణాలు చేస్తారని మేం భావిస్తున్నామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.