యాప్నగరం

ఇద్దరు మంత్రులను తొలగించిన గోవా సీఎం

సీఎం మనోహర్ పారికర్ సైతం బాధ్యతల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Samayam Telugu 24 Sep 2018, 1:29 pm
గోవా కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించారు. అనారోగ్య కారణాలతో సతమతవుతున్న మంత్రులను గోవా కేబినెట్ నుంచి తప్పించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే సీఎం మనోహర్ పారికర్ సైతం బాధ్యతల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu Manohar Parrikar


అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా సేవలందిస్తున్న ఫ్రాంకోయిస్ డిసౌజా అనారోగ్య కారణాలతో అమెరికాలో చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి పాండురంగ మద్‌కైకర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో సతమతమవుతున్నారని సీఎంవో వెల్లడించింది. డిసౌజా స్థానంలో నీలేష్ కబ్రాల్, పాండురంగ స్థానంలో మిలింద్ నాయక్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మిలింద్ నాయక్ గతంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, నీలేష్ తొలిసారి గోవా మంత్రివర్గంలో బాధ్యలు స్వీకరిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మనోహర్ పారికరే గోవా సీఎంగా కొనసాగుతారని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ లాల్ ఇటీవల స్పష్టం చేశారు.

కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం ఐసీయూలో ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పారికర్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.