నీటి ప్రైవేటీకరణ.. గోవా నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి..!
వర్షాలు కురిసే సమయంలో వృథా కాకుండా నీటిని నిల్వ చేసుకుని.. దానిని విదేశాలకు ఎగుమతి చేయడం ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పంపితే.. అక్కడ నుంచి ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా మనం పెట్రోల్, డీజిల్ వంటివి దిగుమతి చేసుకోవచ్చని గోవా మంత్రి చేసిన ప్రతిపాదన ఆలోచించే విధంగానే ఉంది. కానీ, ఆచరణ సాధ్యమే కష్టంతో కూడుకున్నది. అలా జరగాలంటే ముందు నీటి నిర్వహణ బాధ్యతలను ప్రయివేట్ సంస్థలకు అప్పగించాలి. డ్యామ్లు నిర్మించాలి.
ప్రధానాంశాలు:
- నీటిని ప్రయివేటికరించాలని గోవా మంత్రి సూచనలు.
- గల్ఫ్కు ఎగుమతి చేసి ఆయిల్ తెచ్చుకోవచ్చని వ్యాఖ్య.
- వర్షపు నీటి కోసం తాలూకాకు ఒక డ్యామ్ నిర్మాణం.
సహజ వనరైన నీటిని ప్రయివేటీకరించాలని గోవా వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ సూచించారు. గోవాలో డ్యామ్ల నిర్మాణం ద్వారా మిగులు నీటిని నిల్వ చేసి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి.. అక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. బుధవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిల్వచేసిన మిగులు జలాలను మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలకు అందజేయాలని అన్నారు. ‘‘విదేశాల నుంచి మనం పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాం.. నీటిని ఎగుమతి చేసి పెట్రోల్ను దిగుమతి చేసుకోవాలి.. గోవాలో దాదాపు 126 అంగుళాల వర్షం కురిసింది.. ఒకవేళ గోవా వ్యాప్తంగా ఆనకట్టలు నిర్మిస్తే ఈ నీటిని ఒడిసిపట్టవచ్చు’’ అని గోవా మంత్రి తెలిపారు. ‘‘ఈ బాధ్యతలను ఓ ప్రయివేట్ సంస్థకు అప్పగించి, ప్రతి తాలూకాలోనూ డ్యామ్ నిర్మించాలి.. ఈ నీటిని అరబ్ దేశాలు లేదా మహారాష్ట్రలోని వర్షాభావ ప్రాంతాలకు తరలించాలి’’ అని చెప్పారు.
‘‘అరబ్బులు భూమి కింద నుంచి తీసిన పెట్రోలు కోసం మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టే.. వర్షాలకు డ్యాముల్లో చేరిన నీళ్లతో కూడా మన అదే పని చేద్దాం’’ అని వివరించారు. రాష్ట్రంలో వర్షపునీటిని సేకరించి కొన్నింటి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఆయన తెలిపారు. ‘‘ దీనికి పెద్దగా ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం లేదు.. రెండు పర్వతాలకు అడ్డంగా ఆనకట్ట కడితే సరిపోతుంది’’ అని మంత్రి వివరించారు.
వేసవి కావడంతో గోవాలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
‘‘అరబ్బులు భూమి కింద నుంచి తీసిన పెట్రోలు కోసం మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టే.. వర్షాలకు డ్యాముల్లో చేరిన నీళ్లతో కూడా మన అదే పని చేద్దాం’’ అని వివరించారు. రాష్ట్రంలో వర్షపునీటిని సేకరించి కొన్నింటి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఆయన తెలిపారు. ‘‘ దీనికి పెద్దగా ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం లేదు.. రెండు పర్వతాలకు అడ్డంగా ఆనకట్ట కడితే సరిపోతుంది’’ అని మంత్రి వివరించారు.
వేసవి కావడంతో గోవాలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.