యాప్నగరం

పల్లవుల కాలం నాటి ఆలయంలో గుప్త నిధులు.. ట్రస్ట్ బోర్డు, ప్రభుత్వం మధ్య వివాదం

పురాతన ఆలయాన్ని పునరుద్దరించాలని నిర్ణయించిన ఆలయ కమిటీ ఇందుకు పనులు ప్రారంభించింది. జేసీబీతో తవ్వకాలు మొదలుపెట్టిన కాసేపటికి భారీగా నిక్షేపాలు బయటపడ్డాయి.

Samayam Telugu 13 Dec 2020, 5:06 pm
ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు నాణేలు బయటపడ్డ విషయం తెలిసిందే. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు జరిపుతుండగా ఓ కుండలో నాణేలు బయటపడ్డాయి. తాజాగా, తమిళనాడులోని మరో ఆలయంలో గుప్త నిధులు వెలుగుచూశారు. కాంచీపురం జిల్లాలోని ఉత్తర మేరూర్ కుళంబేశ్వరర్ ఆలయంలో గుప్తనిధులు లభ్యమయ్యాయి. పల్లవుల కాలం నాటి ఈ ఆలయంలో పునరుద్దరణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలు, నాణేలను గుర్తించారు. ఇవి మొత్తం రెండు కిలోలకుపైగా ఉంటాయని భావిస్తున్నారు.
Samayam Telugu తమిళనాడులో బయటపడ్డ నిధులు


ఆలయానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పురాతనమైన ఆలయాన్ని పడగొట్టి, పునరుద్దరించాలని పనులు ప్రారంభించామన్నారు. రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఈ పనులు చేపట్టామన్నారు. ఆలయ ప్రవేశ ద్వారం ముందున్న రాతి మెట్లను తొలగించగా.. ఓ వస్త్రంలో చుట్టి ఉంచిన బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయన్నారు. మొత్తం 100 నాణేలు ఇందులో ఉన్నాయని తెలిపారు. కొన్నింటి స్థానికులు తీసుకెళ్లారని, నిధులు బయటపడ్డ విషయం తెలిసి అధికారులు, పోలీసులు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

స్థానికులు తీసుకెళ్లిన నాణేలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉత్తరమేరూర్‌లోని కులంబేశ్వరర్ ఆలయాన్ని రెండో కులోత్తోంగచోలుడు కాలంలో నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. విదేశీయుల దాడి నుంచి స్వామి విగ్రహాలను అలంకరించడానికి తయారు చేసిన నగలు ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఈ నిధిపై వివాదం నెలకుంది. ఈ నిధులు కుళంబేశ్వర ఆలయానికే చెందుతాయని ట్రస్ట్ బోర్డు.. లేదు వీటిపై సర్వాధికారాలు తమకే ఉంటాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, తమ ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో లేదని, నిధులు ఆలయానికే చెందాలని ట్రస్టు అంటోంది. ఇది పురాతన ఆలయం కాబట్టి నిధులు ప్రభుత్వానికే చెందాలని అధికారులు వాదిస్తున్నారు. కాగా, ప్రస్తుతం బయటపడ్డ నిధి నిక్షేపాలు పల్లవుల కాలం నాటివని భావిస్తున్నారు. ఇంకా మరింత సంపదలు దొరుకుతాయేమోనని తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.