యాప్నగరం

ఎర్రబుగ్గ కార్ల వాడకంపై కేంద్రం సంచలన నిర్ణయం!

వీఐపీల హోదా సంప్రదాయానికి చరమగీతం పాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (ఏప్రిల్ 19) గొప్ప ముందడుగు వేసింది..

TNN 19 Apr 2017, 2:16 pm
వీఐపీల హోదా సంప్రదాయానికి చరమగీతం పాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (ఏప్రిల్ 19) గొప్ప ముందడుగు వేసింది. వీఐపీల వాహనాలపై ఎర్ర బుగ్గల వాడకాన్ని నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన నిబంధనల ప్రకారం.. మే 1 నుంచి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్ మినహా మిగిలిన వీవీఐపీలెవ్వరూ బుగ్గకార్లను వినియోగించడానికి వీల్లేదు. ఇప్పటివరకూ కేబినెట్ మంత్రులు, న్యాయమూర్తులు తదితర వీఐపీలు కూడా ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు.
Samayam Telugu government does away with red beacons for vips from may 1
ఎర్రబుగ్గ కార్ల వాడకంపై కేంద్రం సంచలన నిర్ణయం!


గత ఏడాదిన్నర కాలంగా.. ఈ నిర్ణయం కేంద్రం పరిశీలనలో ఉంది. వీఐపీ హోదా అనేది స్టేటస్ సింబల్‌గా మారడం, తద్వారా ప్రజలకు సమస్యలు ఎదురవడం తదనంతర పరిణామాల నేపథ్యంలో.. దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. విస్తృత అభిప్రాయ సేకరణ అనంతరం ఆ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పలు చర్యలను సిఫారసు చేస్తూ నివేదిక పంపించారు. అందులో.. ఎర్రబుగ్గ స్టేటస్‌పై పరిమితులు విధించడం ఒకటి.

డిల్లీ ప్రభుత్వంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు ఎర్రబుగ్గ కార్ల వాడకాన్ని నిలిపేస్తూ మొట్టమొదటగా నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, పంజాబ్‌లోని అమరిందర్ సింగ్ ప్రభుత్వం కూడా ఎర్రబుగ్గ కార్ల వాడకాన్ని దూరం పెడుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో.. వీటి వాడకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలువురు వీఐపీలు ఖంగుతినడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.