యాప్నగరం

రాజ్యసభలో ఈబీసీ బిల్లు.. విపక్షాలు ఆందోళన!

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది.

Samayam Telugu 9 Jan 2019, 12:48 pm
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశాలను పొడిగించడంపై రాజ్యసభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ సభలో ఆందోళనలు చేపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్‌ సహా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని విమర్శించారు. అయితే, బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.
Samayam Telugu rajyasabha


అయితే, అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన ఈబీసీ బిల్లు, ట్రిపుల్ తలాక్ లాంటి కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందునే సభను పొడిగించామని కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ పేర్కొన్నారు. సభ పొడిగించడాన్ని దేశం మొత్తం కోరుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే, విపక్షాలు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. కాగా, అగ్రవర్ణాల్లో వెనుకబడిన పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ పెద్దల సభలో ప్రతిపాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.