యాప్నగరం

ప్రభుత్వం మాత్రమే ఫేక్ వార్తలను గుర్తించలేదు.. ఐటీ రూల్స్ సవరణపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన

Editors Guild: ప్రభుత్వం మాత్రమే నకిలీ వార్తలను గుర్తించలేదని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఐటీ నిబంధనలకు కేంద్రం ఇటీవల చేసిన ముసాయిదా సవరణపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే ముప్పు ఉందని అభిప్రాయపడింది. మీడియా సంస్థలు, ప్రెస్ బాడీలతో సంప్రదించి డిజిటల్ మీడియా ఫ్రేమ్‌వర్క్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఫేక్ సమాచారం ఉన్న కంటెంట్‌తో వ్యవహరించడానికి ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ గుర్తు చేసింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 19 Jan 2023, 12:14 am
కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనలకు ఇటీవల చేసిన ముసాయిదా సవరణపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ‘ఫేక్’ వార్తగా పరిగణించిన వార్తా కథనాలను తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలను కోరుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘తొలగించమని’ బుధవారం (జనవరి 18) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కకుండా, డిజిటల్ మీడియా నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌పై ప్రెస్ బాడీలు, మీడియా సంస్థలు, ఇతర వాటాదారులతో అర్థవంతమైన సంప్రదింపులు ప్రారంభించాలని, ఈ కొత్త సవరణను తొలగించాలని మంత్రిత్వ శాఖను ఎడిటర్ గిల్డ్ కోరింది.
Samayam Telugu Freedom of press
ఎడిటర్స్ గిల్డ్


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2021కి సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, నకిలీ వార్తల నిర్ధారణ కేవలం ప్రభుత్వం చేతుల్లో ఉండదని, ఇది పత్రికా సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుందని ఎడిటర్ గిల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. సమాచార సాంకేతికతకు సంబంధించి చేసిన ఈ ముసాయిదా సవరణపై ‘తీవ్ర ఆందోళన’గా వ్యక్తం చేసింది.

కొత్త సమస్యలు రావొచ్చు..!
వాస్తవానికి నకిలీ సమాచారంతో ఉన్న కంటెంట్‌తో వ్యవహరించడానికి ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ గుర్తు చేసింది. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రాథమికంగా మీడియా నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తుందని ఎడిటర్ గిల్డ్ అభిప్రాయపడింది. పీఐబీ (PIB)కి లేదా ‘ఫేక్ వార్తలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనా ఇతర ఏజెన్సీకి’ ఇది అధిక అధికారాలను ఇస్తుందని పేర్కొంది. అప్పుడు సోషల్ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు.. కంటెంట్‌ను తీసివేయమని మీడియా సంస్థలను బలవంతం చేసే పరిస్థితి వస్తుందని వివరించింది. దీని వల్ల ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఎదురుకావొచ్చని అభిప్రాయపడింది.

ముసాయిదాలో ‘కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు (in respect of any business of the Central government)లకు సంబంధించి ఏది నకిలీ? ఏది కాదో? నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే ఉంటుందని ప్రత్యేకంగా పేర్కొన్న పదాల గురించి ప్రస్తావిస్తూ.. ఇది ప్రభుత్వంపై న్యాయబద్ధమైన విమర్శలను అణిచివేస్తుందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించాల్సిన మీడియా సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకునే ప్రమాదకర పరిస్థితికి ఇది దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం.. ముసాయిదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియెటరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి సవరణను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది.

ఐటీ రూల్స్‌ను మొదటిసారిగా మార్చి 2021లో ప్రవేశపెట్టినప్పుడే తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసిన విషయాన్ని ఎడిటర్స్ గిల్డ్ గుర్తుచేసింది. న్యాయపరమైన సంస్థల పర్యవేక్షణ లేకుండానే.. ప్రచురించిన వార్తలను బ్లాక్ చేయడానికి, తొలగించడానికి, సవరించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం సమంజసం కాదని పేర్కొంది. ఈ నియమాలలోని వివిధ నిబంధనలు డిజిటల్ మీడియాపై అసమంజసమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది.

ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు
కవల సోదరులు.. 900 కి.మీ. దూరంలో ఇద్దరూ ఒకే తరహాలో మృతి
Read Latest National News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.