యాప్నగరం

300 మందిని నపుంసకులుగా మార్చేసిన రేపిస్ట్ బాబా

తీగలాగితే డొంక కదిలినట్లు అత్యాచారం కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష ఖరారైన వివాదస్పద ఆధ్యాత్మిక గురువు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

TNN 29 Aug 2017, 10:55 am
తీగలాగితే డొంక కదిలినట్లు అత్యాచారం కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష ఖరారైన వివాదస్పద ఆధ్యాత్మిక గురువు బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిర్సాలోని డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ రాం రహీం సింగ్ అకృత్యాలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని ఆయన మాజీ బాడీ గార్డ్ బియాంత్ సింగ్ పేర్కొన్నాడు. డేరా ఆశ్రమంలో 600 మంది పురుషులు శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుండగా, వేలాది మంది తాత్కాలిక ప్రాతిపదికన, మరి కొందరు స్వచ్చందంగా షిఫ్టులవారీగా పనిచేస్తారని ఆయన తెలిపారు.
Samayam Telugu gurmeet ram rahim singhs ex bodyguard says dera chief got male followers castrated
300 మందిని నపుంసకులుగా మార్చేసిన రేపిస్ట్ బాబా


అయితే శాశ్వత ఉద్యోగులుగా పనిచేసే 250 నుంచి 300 మందిని నపుంసకులుగా, శృంగారానికి పనికిరానివారిగా గుర్మీత్ మార్చేశారని బియాంత్ సింగ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరికి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా చేస్తే, మరికొంత మందికి వృషణాలను తొలగించారని ఆయన తెలియజేశారు. వారిలో కొందరు ఇంకా అక్కడే పని చేస్తుండగా, కొందరు డేరా వదిలి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లిపోయారని ఆయన తెలిపారు.

గుర్మీత్ రాం రహీం సింగ్ కేవలం అత్యాచారాలకు మాత్రమే పరిమితం కాలేదని, హత్యలు, భూకబ్జాలకు కూడా పాల్పడ్డాడని బియాంత్ సింగ్ వెల్లడించారు. గుర్మీత్ సింగ్ చేయని దారుణం లేదని, హత్యలు చేయడం ఆయనకు సర్వసాధారణమని అన్నారు. ఏదైనా స్థలం మీద అతడి కన్ను పడితే, వెంటనే తన గూండాలను అక్కడకు పంపేవాడని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో వారు మలమూత్ర విసర్జన చేసేవారని అన్నారు. అలా చేసిన తర్వాత ఆ భూమి యజమాని ఎట్టిపరిస్థితుల్లో బాబాకే దాన్ని విక్రయించాలని ఆయన అన్నారు.

అలా చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండేవని ఆయన తెలియజేశారు. పోనీ ఆ భూమికైనా సరైన ధరకట్టేవాడా? అంటే, అది కూడా జరిగేది కాదని, రూ.20 లక్షల విలువైన భూమికి కేవలం ఒకటి, లేదా రెండు లక్షలు చేతిలో పెట్టేవాడని, ఆ ధరకు ఇవ్వమని ఎవరైనా మొండికేస్తే కబ్జా చేసేవాడని ఆయన తెలిపారు. గుర్మీత్ ఆశ్రమంలో నల్లధనం, అక్రమ ఆయుధాలు భారీగా పోగుపడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు కూడా ఉండడం విశేషమని ఆయన తెలిపారు. అంతే కాకుండా, 2007లో గురుగోవింద్‌ సింగ్‌‌ను అనుకరించి సిక్కుల మనోభావాలను దెబ్బతీశాడని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.