యాప్నగరం

వీడియో: కన్నీటి కేరళ.. సగం భూభాగం జల దిగ్బంధంలోనే!

వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృత ప్రవాహాలతో నదులు భయపెడుతున్నాయి, నిండుకుండలా మారిన డ్యాంలు ఎప్పుడు తెగిపోతాయో అన్నట్లు భయంగొల్పుతున్నాయి. రాష్ట్రంలోని సగం భూభాగం జల దిగ్బంధంలోనే ఉంది.

Samayam Telugu 11 Aug 2018, 6:45 pm
వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృత ప్రవాహాలతో నదులు భయపెడుతున్నాయి, నిండుకుండలా మారిన డ్యాంలు ఎప్పుడు తెగిపోతాయో అన్నట్లు భయంగొల్పుతున్నాయి. రాష్ట్రంలోని సగం భూభాగం జల దిగ్బంధంలోనే ఉంది. ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తడంతో సుమారు 54,000 మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటివరకూ 29 మంది మరణించారు. కేరళలో భారీ వర్షాలు మిగిల్చిన విషాదమిది.
Samayam Telugu rain


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దక్షిణాది రాష్ట్రం కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదల కారణంగా వందలాది నగరాలు, పట్టణాలు నీటమునిగాయి. కేరళలోని 14 జిల్లాలకు గాను 7 జిల్లాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య భాగం పూర్తిగా నీటమునిగింది. కోచి విమానాశ్రయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

కోచిలో పెరియార్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇరుక్కిలోని చెరుతోని నది తీర ప్రాంతాల్లోని గ్రామాలను ముంచేస్తూ ప్రవహిస్తోంది. చిన్నా, పెద్దా 40 నదుల్లోని పరిస్థితి ఇలాగే ఉంది. నిండుకుండలా మారిన ఇడుక్కి డ్యాంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని 58 రిజర్వాయర్లలో 24 డ్యాంల పరిస్థితి ఇలాగే ఉంది. గత 40 ఏళ్లలోనే కురిసిన భారీ వర్షాల కారణంగా మూడు దశాబ్దాలుగా గేట్లు ఎత్తని డ్యాంలు కూడా భారీ ప్రవాహంతో కిందకి దుంకుతున్నాయి.

కొండచరియలు విరిగిపడుతుండటంతో వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోగా.. కొండ చరియలు విరిగిపడటం వల్లే 25 మంది మృత్యువాతపడటం గమనార్హం. కనుచూపుమేరలో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరద ప్రభావానికి రహదారులన్నీ కొట్టుకుపోయాయి.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం (ఆగస్టు 11) ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. ఆయనతో పాటు ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల, రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టామ్‌ జోస్‌, పోలీస్‌ చీఫ్‌ లోక్‌నాథ్‌ బెహరా కూడా వరదల పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

జలదిగ్బంధంలో చిక్కుకున్న కేరళకు సాయం అందించడానికి ఇండియన్ ఆర్మీకి చెందిన 5 సైనిక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి సైన్యం స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్నార్‌లోని ప్లమ్‌ జూడీ రిసార్టులో చిక్కుకున్న 50 మంది పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 24 మంది విదేశీయులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 439 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.