యాప్నగరం

ఏడాదిన్నరలో రూ.185 కోట్ల పెరిగిన మాజీ ఎమ్మెల్యే ఆస్తులు.. అవాక్కయిన సీఈఓ!

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హులుగా ప్రకటించి, ఉప-ఎన్నికల్లో పోటీకి కూడా అనర్హులుగా ప్రకటించారు.

Samayam Telugu 16 Nov 2019, 1:44 pm
అనర్హత వేటుపడిన కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట బీజేపీలో చేరి ఉప-ఎన్నికల బరిలో నిలిచారు. కర్ణాటకలో మొత్తం 15 స్థానాలకు డిసెంబరు 5న ఉప-ఎన్నికలు జరగనున్నాయి. అనర్హత ఎమ్మెల్యేలు కూడా పోటీకి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో నామినేషన్ల గడువును నవంబరు 18 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా వీరంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. హోస్‌కోట నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న ఎంటీబీ నాగరాజు నామినేషన్ దాఖలు చేయగా, అందులో ఆయన పొందుపరిచిన ఆస్తుల వివరాలను చూసి ఎన్నికల ప్రధానాధికారి సైతం షాక్ తిన్నారు.
Samayam Telugu mtb_vb_71.


ఏడాదిన్నరలో నాగరాజు ఆస్తులు ఏకంగా రూ.185 కోట్లు పెరిగినట్లు అఫిడ్‌విట్‌లో తెలిపారు. నాగరాజు, ఆయన భార్య శాంతకుమారి ఆస్తుల మొత్తం విలువ రూ.1201కోట్లుగా పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఆస్తుల విలువ రూ.1015 కోట్లుగా చూపారు. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగరాజు చరాస్తుల విలువ రూ.419.28కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.417.కోట్లు, ఆయన భార్య చరాస్తుల విలువ రూ.167.34 కోట్లుగా చూపారు.

గత 18 నెలల్లో ఆయన చరాస్తుల విలువ రూ.104.53 కోట్లు పెరిగితే, భార్య ఆస్తి విలువ రూ.44.95 కోట్లు పెరిగింది. ఆగస్టులో కేవలం ఆరు రోజుల వ్యవధిలో నాగరాజు ఆస్తుల విలువ రూ. 25.84 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఆగస్టు 2 నుంచి 7 వరకు ఆయన బ్యాంకు ఖాతాలో 53 సార్లు డిపాజిట్ చేశారు. ఒక్కోసారి రూ.90 లక్షల కంటే ఎక్కువ నగదును మొత్తం రూ.48.76 కోట్లు డిపాజిట్ చేయడం విశేషం. జులైలో రూ.1.16 కోట్లు ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. తన పేరుతో 57 ఎకరాలు, భార్య పేరుతో నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు.

అలాగే తన పేరుతో రూ.2.23 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడ్‌విట్‌లో వెల్లడించారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం జులై 23న కూలిపోగా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. జులై 26న యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఆగస్టులో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి నాగరాజు వార్తల్లో నిలిచారు. రూ.11 కోట్లతో రోల్స్ రాయిస్ ఫాంటమ్-8ను కొనుగోలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.