యాప్నగరం

ఢిల్లీ హింస: అప్పుడే వారిని పోలీసులు అడ్డుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు!

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై డిసెంబరు నుంచి దేశ రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నా గతవారం ఈశాన్య ఢిల్లీలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది.

Samayam Telugu 1 Mar 2020, 10:19 am
గత ఆదివారం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసి 42 మందిని పొట్టనబెట్టుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు ఈశాన్య ఢిల్లీ రణరంగాన్ని తలపించింది. దీనికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. నిఘా వర్గాలు హెచ్చరించినా తగినంత బలగాలను మోహరించకపోవడం, ఘర్షణ మొదలైనప్పుడు పోలీసుల వేగంగా స్పందిచకపోవడంతోనే నియంత్రణలో లేకుండా పోయింది. అయితే, ఈశాన్య ఢిల్లీలో హింసకు ఫిబ్రవరి 22 శనివారం రాత్రి 10 గంటల సమయంలోనే బీజాలు పడ్డాయి. మెట్రో స్టేషన్ నుంచి జఫ్రాబాద్ ఇరుకు వీధుల్లో దాదాపు 600 మంది మహిళలు ర్యాలీగా వెళ్తున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారు.
Samayam Telugu Delhi6


వీరంతా మెట్రో స్టేషన్‌‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లిన స్థానిక ప్రజలుగానే పోలీసులు భావించారు. ఆ సమయంలో మహిళా పోలీసులు తక్కువగా ఉండటంతోపాటు వారిని నిలువరించడానికి ప్రయత్నించలేదు. వారిని చెదరగొట్టడానికి పై నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు, ఇలాంటి చర్యను కోర్టులు ఎలా స్పందిస్తాయోననే మీమాంశతో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.

ఈ మహిళలకు 400 మంది పురుషులు తోడయ్యారని, వీరంతా స్థానికేతరులేనని ఓ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. ఆదివారం ఉదయానికి వీరి సంఖ్య 3,000కి చేరిందని, వారిని అక్కడ నుంచి వెళ్లగొట్టలేకపోయినా, వేదిక, టెంట్లు వేసుకోడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అదుపుతప్పిందని, సీఏఏ వ్యతిరేక వర్గాన్ని ఆందోళనకు అనుమతిస్తే తాము రహదారిని దిగ్బంధిస్తామని హిందూ అనుకూల వర్గాలు ప్రకటించాయన్నారు. వారిని సముదాయించడానికి ప్రయత్నించినా వారు పట్టించుకోలేదని తెలిపారు. కొద్ది సేపటి తర్వాత ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడినట్టు వివరించారు. అర్ధరాత్రి తర్వాత పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకురాగలిగారని ఆయన పేర్కొన్నారు.

షహీన్‌బాగ్ మాదిరిగా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగినట్టు వస్తున్న ఆరోపణలను ఓ ఉన్నతాధికారి ఖండించారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని అధికారుల తప్ప మిగతావారు ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు పర్యటన కోసం ఏర్పాట్లలో తలమునకలై ఉన్నామని అన్నారు. అవసరమైన మేర సిబ్బంది ఉన్నా అల్లర్లను అదుపుచేయడానికి తమకు సమయం పట్టిందని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో అల్లర్లు చెలరేగాయన్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు దాడులు, నాటు తుపాకులు, సెమి-ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు చోటుచేసుకున్నాయి. వారిని అదుపుచేయడానికి వెళ్లిన పోలీసులపై కూడా దాడిచేశారని వివరించారు.

షాహదారా డీసీపీ అమిత్ శర్మ ఆయన టీమ్, మూడు కంపెనీల బలగాలు ఉదయం 11 గంటలప్పుడు చాద్‌బాగ్ వద్ద ఓ మసీదు సమీపంలో అల్లర్లు అదుపుచేస్తుంటే వారిపై ఆందోళనకారులు కాల్పులు జరపగా, హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతిచెందాడని ఓ అధికారి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.