యాప్నగరం

గతం ఆధారంగా తీర్పులు ఇవ్వలేదు: సీజేఐ దీపక్ మిశ్రా

ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ప్రసంగిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఉద్వేగానికి లోనయ్యారు.

Samayam Telugu 1 Oct 2018, 6:16 pm
ప్రజల గత చరిత్ర, నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తానెప్పుడూ తీర్పు ఇవ్వలేదని, కేవలం వారు చేసిన చర్యలనే ప్రామాణికంగా తీసుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) సోమవారం సాయంత్రం సీజేఐ దీపక్ మిశ్రాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించింది. భారత అటార్నీ జనరల్ సహా ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Samayam Telugu Dipak Misra


ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ప్రసంగిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజలు (నిందితుల) గత నేపథ్యం, చరిత్ర లాంటి విషయాలకు తానెప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేవలం కేసు విషయంలో వారు చేసిన చర్యలు, సాక్ష్యాలు ఆధారంగా తీర్పు వెల్లడించేవాడినని తెలిపారు. నిజాలకు ఎలాంటి రంగు ఉండదని, అలాగని తయారుచేస్తే కనిపించేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని న్యాయవ్యవస్థలు అన్నింటిలో భారత న్యాయవ్యవస్థ అత్యంత విలువైనదని, బలమైనదని పేర్కొన్నారు.

న్యాయానికి (నిజానికి) మానవ రూపం ఉంటుందని తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. జూనియర్ న్యాయమూర్తులు సీనియర్ల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బార్ కౌన్సిల్‌లో ఎన్నో విషయాలు నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు భంగం వాటిల్లకుండా నూతన న్యాయమూర్తులు మసలుకోవడం ఉత్తమమని సూచించారు.

కాగా, భారత 45వ సీజేఐగా 2017 ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ దీపక్ మిశ్రా మంగళవారం (అక్టోబర్ 2న) పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 3న జస్టిస్ రంజన్ గొగోయ్ 46వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా తన తర్వాతి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్‌ను సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.