125 కోట్ల భారతీయులు ఈ ఫిబ్రవరి 29వ తేదీ(సోమవారం)న తనను పరీక్షించబోతున్నారని దేశ ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రతీ నెల రేడియో ద్వారా ఆయన మన్ కీ బాత్ (మనసులో మాట) పేరిట దేశ జనులను ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు. అందులో భాగంగా ఆయన ఆదివారం మన్ కీ బాత్ లో తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకున్నారు. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోసారు. పరీక్షలంటే భయపడవద్దని.. సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కోవాలని, జీవితంలో పైకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకే (విద్యార్థులకే) కాదు నాకు కూడా ఇది పరీక్షా సమయమే.. రేపు బడ్జెట్ సందర్భంగా యావత్ జాతి నాకు పరీక్ష పెట్టబోతోందన్నారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. బడ్జెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేశ జనుల నుండి మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్, విశ్వవిఖ్యాత చదరంగ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు వారు కూడా తగు సూచనలిచ్చారు.
మీకే కాదు.. నాకూ రేపు పరీక్ష ఉంది: మోడీ
125 కోట్ల భారతీయులు ఈ ఫిబ్రవరి 29వ తేదీ(సోమవారం)న తనను పరీక్షించబోతున్నారని దేశ ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
TNN 28 Feb 2016, 12:40 pm