యాప్నగరం

అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 6 రోజుల్లో ఎన్ని దరఖాస్తులో తెలుసా?

Agnipath IAF Applications: త్రివిధ దళాల్లో నియామకాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు విశేష స్పందన లభిస్తోంది. అగ్నిపథ్ ఐఏఎఫ్‌ నియామకాలకు కేవలం 6 రోజుల్లోనే సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్నిపథ్ IAF ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జులై 5. అప్పటికి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరగడం గమనార్హం.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 Jun 2022, 11:52 pm
భారత త్రివిధ దళాల్లో (ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్) నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‌ (Agnipath)’ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. Indian Air Force నియామకాల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్‌ 24న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. కేవలం 6 రోజుల వ్యవధిలోనే 1 లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే 6 రోజుల్లో ఈ సంఖ్యకు రెట్టింపు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుంది. చివరి రోజుల్లో ఎక్కువ మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
Samayam Telugu ఐఏఎఫ్
Indian Air Force


త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణల్లో భాగంగా కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను తీసుకొచ్చింది. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 సంవత్సరాల గల యువకులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లు పూర్తయ్యాక అభ్యర్థుల్లో 25 శాతం మంది అగ్నివీరులను ఉద్యోగాల్లో కొనసాగిస్తామని కేంద్రం పేర్కొంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి తీసుకుంటామని ప్రకటించింది.

కొవిడ్ సంక్షోభం కారణంగా త్రివిధ దళాల్లో రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది రిక్రూట్మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచారు. దరఖాస్తుల సంఖ్య పెరిగడానికి ఇది కూడా ఒక కారణం. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓ వైపు నిరసన కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య సైతం పెరుగుతుండటం గమనార్హం.

Also Read:

దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని మోదీ భావిస్తున్నారు: కర్ణాటక మంత్రి
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.