యాప్నగరం

నాకు ఏం జరిగినా కేరళ సీఎందే బాధ్యత: తృప్తి దేశాయ్

తనకు తగినంత భద్రత కల్పించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆమె ఓ లేఖ రాశారు.

Samayam Telugu 15 Nov 2018, 4:59 pm
నవంబర్ 17 సాయంత్రం నుంచి మండల పూజ కోసం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీంతో మరోసారి శబరిమలలో ఉద్రికత్త చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భక్తులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం తలెత్తింది. రెండు పర్యాయాలు శబరిమల అట్టుడుకి పోయింది.
Samayam Telugu Trupti Desai


ప్రస్తుత తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఓపెన్ కోర్టులో (బహిరంగ విచారణ) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 22న విచారణ జరుగుతుందని న్యాయస్థానం పేర్కొంది. సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. తనకు తగినంత భద్రత కల్పించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆమె ఓ లేఖ రాశారు.

తన లేఖపై కేరళ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తృప్తి దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కేరళ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. కచ్చితంగా శబరిమల ఆలయానికి వెళ్తాను. ఒకవేళ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం కేరళ సీఎం విజయన్, రాష్ట్ర డీజీపీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. శబరిమల ఆలయ ప్రవేశానకి భద్రత కోరితే స్పందించక పోవడం దారుణమని’ తృప్తి దేశాయ్ వ్యాఖ్యానించారు.

మండల పూజ కోసం నవంబర్ 17న తెరవనున్న ఆలయాన్ని తిరిగి డిసెంబరు 27న మూసేయనున్నారు. అనంతరం మక్కరవిళక్కు కోసం డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు తెరిచి ఉంచుతారు. మరోవైపు నిషేదిత వయసున్న 500 మంది మహిళలు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో గుర్తింపు కార్డు ప్రస్తావన కూడా ఉండదు. కనుక మహిళల వయసు వివరాలపై స్పష్టత ఉండదు. గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, సీఎం విజయన్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.