యాప్నగరం

తొలి రోజే ఆకట్టుకున్న వెంకయ్య..!

1998లో తొలిసారి సభలో ప్రవేశించినప్పుడు ఈ సభకు నేను నేతృత్వం వహించే రోజు వస్తుందని ఊహించలేదు. ఇదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య గొప్పతనం..

TNN 12 Aug 2017, 7:17 pm
అత్యంత గొప్పదైన మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ప్రపంచదేశాలు కూడా చూస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పని చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అధ్యక్ష హోదాలో శుక్రవారం (ఆగస్టు 11) ఆయన రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. పార్లమెంటు నడుస్తున్న తీరును ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తున్న సామాన్యుడు కొంత అసంతృప్తికి గురవుతున్నాడని ఆయన అన్నారు. వారి భావాలను అర్థం చేసుకొని మసలుకోవాలని ఎంపీలకు సూచించారు. ‘ఇఫ్ యూ కోపరేట్.. ఐ కెన్ ఆపరేట్ (మీరు సహకరిస్తే.. నేను నడిపిస్తా)’ అంటూ తనదైన శైలిలో చమత్కరించి చెప్పారు.
Samayam Telugu if you cooperate i can operate venkaiah naidu tells mps as rajya sabha chairman
తొలి రోజే ఆకట్టుకున్న వెంకయ్య..!


‘1998లో తొలిసారి సభలో ప్రవేశించినప్పుడు ఈ సభకు నేను నేతృత్వం వహించే రోజు వస్తుందని ఊహించలేదు. ఇదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య గొప్పతనం. ఇక మీదట నేను అన్ని పార్టీల వ్యక్తిని. నిష్పక్షపాతంగా పనిచేస్తా. ఈ సభను సజావుగా నడుపుతూ అందరికీ అవకాశం కల్పిస్తా. నిబంధనల ప్రకారం నడుచుకుంటే చిన్న, పెద్ద పార్టీలన్న వ్యత్యాసం లేకుండా అందరికీ అవకాశం వస్తుంది’ అని వెంకయ్య పేర్కొన్నారు.

‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నా.. భారత్‌ ముందడుగేస్తోంది. మున్ముందు మనకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అసమానతలు, వ్యవసాయ సమస్యలు, అధికార దుర్వినియోగం, ప్రాంతీయ, ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నాం. మనతో పాటు స్వాతంత్రం పొందిన కొన్ని దేశాలు స్పష్టమైన దృక్పథంతో ముందుకెళ్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం కలిసి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు.

‘ఈ సభ ఏడాదిలో 100 రోజులు సమావేశమవుతోంది. సభ్యులంతా ఈ సమయాన్ని దేశ ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలి. అన్ని పార్టీల సభ్యులకూ సమయం లభించేలా చూస్తా. వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృథా చేసుకుంటే చిన్న పార్టీల సమయం హరించుకుపోతుంది. ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తర్వాత ఇంకా అవసరం అనిపిస్తే సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమయాన్ని వృథా చేసుకొని.. పొడిగింపును కోరడం సరికాదు’ అని వెంకయ్య అన్నారు.

‘పెద్దల సభగా మనం దేశంలోని మిగతా సభలకు ఆదర్శంగా ఉండాలి. నిరుపేదల అవసరాలను గుర్తించాలి. వారి ఆవేదనను వినాలి. వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని నెరవేర్చాలి. రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన హక్కులన్నీ దక్కేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. దేశం కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంత వాతావరణంలో పూర్తిస్థాయిలో చర్చిస్తే గందరగోళంలో బిల్లులను ఆమోదించాల్సిన అవసరమే ఉండదు’ అని వెంకయ్య పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.