యాప్నగరం

మరోసారి డోక్లామ్‌‌లో సేనలను మోహరించిన చైనా!

డోక్లామ్ ప్రాంతంలో చైనా తన బలగాలను మరోసారి మోహరించింది. ఇటీవలే డోక్లామ్ సమీపంలో రెండు హెలీప్యాడ్లు నిర్మించి, రహదారుల విస్తరణ చేపట్టారు.

TNN 11 Dec 2017, 11:13 am
డోక్లామ్ ప్రాంతంలో చైనా తన బలగాలను మరోసారి మోహరించింది. ఇటీవలే డోక్లామ్ సమీపంలో రెండు హెలీప్యాడ్లు నిర్మించి, రహదారుల విస్తరణ చేపట్టారు. శీతాకాలం క్యాంపు పేరుతో సుమారు 1600 నుంచి 1800 మంది చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు భారత్, భూటాన్, చైనా త్రికూడలి డోక్లామ్‌కు చేరుకున్నారు. శీతాకాలంలో చలి ప్రభావం నుంచి తట్టుకునేందుకు తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటుచేసుకున్నట్లు సమాచారం. అయితే చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, దీన్ని తమ శాశ్వత స్థావరంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు మార్చుకున్నాయని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణవైపు జంపేరి రిడ్జ్ వరకు అనుమతి లేకపోయినా ఆ ప్రాంతంలో చైనా సైన్యం తిష్టవేసిందని తెలిపాయి. ఈ ఏడాది జూన్‌లో వివాదస్పద ప్రాంతం డోక్లామ్‌లో చైనా సైన్యం రహదారి నిర్మాణం చేపట్టడంతో భారత్ సైన్యం అడ్డుకుంది.
Samayam Telugu in first winter stay 1800 chinese troops camping at doklam
మరోసారి డోక్లామ్‌‌లో సేనలను మోహరించిన చైనా!


దీంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జూన్ నుంచి సెప్టెంబరు చివరి వరకూ సుమారు 73 రోజులు ఈ ఉద్రిక్తతలు కొనసాగాయి. చైనా నిర్మాణాలను భారత్ సైన్యం అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతం నుంచి భారత్ తమ సేనలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనా హెచ్చరించింది. చైనా బెదిరింపులకు భయపడబోమని, ముందు మీరు వెనక్కు తగ్గాలని ఇండియా స్పష్టం చేసింది. యుద్ధం తాము కోరుకోవడంలేదని, చర్చలు ద్వారా సమస్యకు పరిష్కారమే మా అభిమతమని భారత్ చేసిన ప్రతిపాదనను చైనా తిరస్కరించింది. తమ భూభాగంలో చైనా నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయంలో తమకు సాయం చేయాలని భారత్‌ను భూటాన్ కోరింది.

దీంతో చైనా, భారత్ సైనికులు ఒకినొకరు తోసుకున్న దృశ్యాలు అప్పట్లో ఆందోళన కలిగించాయి. భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని భావించిన చైనా పన్నాగాలను భారత్ సమర్థంగా తిప్పికొంట్టింది. దీంతో బెట్టు సడలించిన చైనా యథాతథ స్థితిని కొనసాగించాలనే నిర్ణయానికి అంగీకరించింది. ఇరు దేశాలూ ఓ అంగీకారానికి రావడంతో సైనికులు వెనక్కు తగ్గారు. అయితే తాజాగా చైనా మరోసారి తన దుందుడుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.