యాప్నగరం

అక్కడ నుంచి పూర్తిగా వెనక్కు వెళ్లాల్సిందే.. చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్

India China Borderలో గతేడాది మే నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం.. అవి తమ ప్రాంతాలేనని వితండవాదన చేస్తోంది.

Samayam Telugu 25 Jan 2021, 9:15 am
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తొమ్మిది నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వివాదం పరిష్కారానికి భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఆదివారం తొమ్మిదో దఫా చర్చలు జరిగాయి. రెండున్నర నెలల విరామం తర్వాత ఈ చర్చలు జరగడం గమనార్హం. ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న అనేక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఇందులో ప్రధానంగా చర్చించారు. చైనా భూభాగంలోని చూషుల్-మోల్దో సరిహద్దు శిబిరం వద్ద ఈ చర్చలు జరిగాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాలను పూర్తిగా వెనక్కు మళ్లించాలని ఈ సందర్భంగా భారత్ మరోసారి స్పష్టం చేసింది.
Samayam Telugu భారత్-చైనా సరిహద్దు వివాదం


బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గించి గతేడాది మే మొదటి వారానికి ముందున్న యథతథా స్థితిని నెలకొల్పడానికి సంయుక్త కార్యాచరణలో భాగంగా ఓ రోడ్ మ్యాప్‌ను భారత్ సిద్ధంచేసి, చైనా ముందుంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి దశలో పాంగాంగ్ సరస్సు, చూషుల్, గోగ్రా-హాట్‌స్పింగ్స్‌లో బలగాలను పూర్తిగా వెనక్కు మళ్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఈ చర్చలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

భారత బృందానికి 14 కార్స్స్ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.జి.కె.మేనన్‌ నేతృత్వం వహించగా... చైనా తరఫున దక్షిణ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ నేతృత్వం వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు.. రాత్రి 8 గంటలకు వరకు కొనసాగాయి. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చైనాపైనే ఉందని భారత బృందం స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

‘రెండు వైపులా మొండిగా ఉన్న ఈ దశలో ఏదైనా స్పష్టమైన పురోగతికి అవకాశం లేదు. చర్చల సమయంలో చేసిన ప్రతిపాదనలపై తదుపరి ఆదేశాల కోసం ఇరువురు ప్రతినిధులు తమ రాజకీయ శ్రేణులను సంప్రదిస్తారు.. కానీ శాంతి నెలకొల్పడానికి చర్చలు ముఖ్యం’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

‘చైనా సైన్యం వనరులు అస్థిరంగా ఉన్నాయి. ఎల్ఏసీ వరకు రహదారులు కుడి వైపునకు ఉండటంతో సీపీఎల్‌ఏ వేసవిలో ఎక్కువ బలగాలను, ఆయుధాలను ముందుకు తరలించగలదు. భారత్ ఇప్పుడు పోస్ట్‌ల వద్ద శాశ్వత మోహరింపుల విషయంలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌తో వ్యవహరించే విధానాలను అవలంభించాలి’ అని ఓ అధికారి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.