యాప్నగరం

రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణపతాకం ఎగురవేసిన రాష్ట్రపతి

దేశవ్యాప్తంగా 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Samayam Telugu 26 Jan 2019, 11:19 am
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా సాగుతోన్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు ఇండియా గేట్ నుంచి రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రాంపోసాలతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకం ఆవిష్కరించి, తివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సైనికులకు శౌర్య పతకాలను అందజేశారు. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన లాన్స్ నాయక్ నజీర్ వనీకి ఈ ఏడాది అశోక చక్ర పురస్కారం ప్రకటించగా, ఆయన సతీమణి దానిని అందుకున్నారు.
Samayam Telugu republic2


మరోవైపు, సైన్యానికి చెందిన హెలికాప్టర్లు త్రివర్ణ పతాకాన్ని వినివీధిలో ఎగురవేస్తూ కనువిందు చేశాయి. అనంతరం ఢిల్లీ ప్రధాన కార్యాలయం జనరల్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ అసిత్ మిస్త్రీ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు. దీనికి మేజర్ జనరల్ రాజ్‌పాల్ పూనియా రెండో కమాండ్‌ర్‌గా వ్యవహరించారు. సైనిక విన్యాసాలు, కవాతులు, వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారతీయులందరికీ రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు. జై హింద్‌’ అని మోదీ ట్వీట్‌ చేశారు. రాజ్‌పథ్‌లోని అమర జవాను జ్యోతి వద్ద ఆయన నివాళులర్పించారు. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌, నావికాదళం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతోంది. త్రివిధ దళాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.